రాష్ట్రంలో సమస్యల్లేకుంటే ముక్కు నేలకురాసి ఇంటికిపోతా.. కేసీఆర్, కేటీఆర్ రెడీనా? వైఎస్ షర్మిల సవాల్
తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో కెసిఆర్, కేటీఆర్ ల పై తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టే తాను పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్న వైయస్ షర్మిల కెసిఆర్, కేటీఆర్ ఒక్కరోజు నాతో పాదయాత్రకు రావాలని, సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఇక సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చెయ్యండి అంటూ వైయస్ షర్మిల సవాల్ విసిరారు.
తాగేటోడు ముఖ్యమంత్రి అయితే మందు కలిపేటోడు మంత్రి
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన వైయస్ షర్మిల కెసిఆర్ అన్ని వర్గాలను మోసం చేశారంటూ మండిపడ్డారు. గాడిదకు రంగు పూసి ఆవు అని నమ్మించటమే కెసిఆర్ నైజమని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. తాగేటోడు ముఖ్యమంత్రి అయితే మందు కలిపేటోడు మంత్రి అవుతారని, అందుకే వీళ్ల పాలన తాగుబోతు తాగి పడుకున్నట్టు ఉందని వైయస్ షర్మిల విమర్శించారు. స్కూటర్ లో తిరిగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి రూ.5వేల కోట్లకు ఎట్ల పడగలెత్తాడు? అన్నీ భూకబ్జాలు, మాఫియాలే అంటూ వైయస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుటుంబ సంపాదనలో బిజీ అయిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని వైయస్ షర్మిల మండిపడ్డారు. రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీలేని రుణాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, మూడెకరాల భూమి, పోడు పట్టాలు, ఉచిత ఎరువులు, ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇలా అన్నింటినీ అటకెక్కించాడు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. తెలంగాణా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుటుంబ సంపాదనలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
ఎవరికైంది బంగారు తెలంగాణ? టీఆర్ఎస్ పార్టీకా? పేద ప్రజలకా?
టీఆర్ఎస్ అకౌంట్లో రూ.860కోట్లు ఉన్నాయట. వడ్డీనే నెలకు రూ.3కోట్లు వస్తుందట. ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదట కెసిఆర్ కు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ కుటుంబం బాగు పడిందని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఎవరికైంది బంగారు తెలంగాణ? టీఆర్ఎస్ పార్టీకా? పేద ప్రజలకా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ప్రశ్నించడం మానేసి కేసీఆర్ సంకన ఎక్కిందని, మత పిచ్చి బాగా ఉన్న బిజెపి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసిందని వైయస్ షర్మిల ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కు గట్టి బుద్ధి చెప్పాలి
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కెసిఆర్ వస్తున్నారు.. మాయ మాటలు చెప్తున్నారు.. ఓట్లు దండుకుంటున్నారు.. వెళ్లిపోతున్నారు అంటూ వైయస్ షర్మిల పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కు గట్టి బుద్ధి చెప్పాలి. ప్రజల పక్షాన నిలబడుతోంది కేవలం వైయస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే అంటూ షర్మిల వెల్లడించారు. తన గుండెలో నిజాయితీ ఉందని ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందని వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడానికి ప్రజలు తనను ఆశీర్వదించాలని వైయస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.