ఆయుష్మాన్ భారత్లో తిరకాసు-పేదలందరికీ వైద్యం అందదు-కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చండి : వైఎస్ షర్మిల
తెలంగాణలో కరోనా వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్ పథకంలో పేదలను గుర్తించడంలో తిరకాసు ఉందన్నారు. ఈ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే లబ్ది పొందుతాయని తెలిపారు.అదే ఆరోగ్యశ్రీ కింద 80 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయని తెలిపారు. ఈ మేరకు షర్మిల ట్విట్టర్ ద్వారా స్పందించారు.
80 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. కానీ ఆయుష్మాన్ భారత్ వలన లబ్ధి పొందేది కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే. పేదలను గుర్తించటంలో తిరకాసులు ఉన్న ఆయుష్మాన్ భారత్.. పేదలందరికి కరోనా వైద్యం అందించలేదు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.' అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం నిబంధనల ప్రకారం... టూ వీలర్,త్రీ వీలర్,ఫో వీలర్ ఉన్నవారు,ల్యాండ్ లైన్ ఫోన్ కలిగినవారు,చేపలు పట్టే బోటు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నెలకు రూ.10వేలు సంపాదిస్తున్నా ఈ పథకం వర్తించదు. ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు,ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించే కుటుంబాలకు కూడా వర్తించదు. కేవలం ఒక గది ఇల్లు ఉన్నవారికే పథకం వర్తిస్తుంది.
అదే ఆరోగ్యశ్రీలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి రూ.2లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. ఆయుష్మాన్ భారత్లో ఉన్న నిబంధనల కారణంగా చాలామందికి ఆ పథకం వర్తించే అవకాశం లేదు. అందుకే ఈ పథకం ద్వారా తెలంగాణలో 26 లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూరనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు ఇటీవలే నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుతో ఆస్పత్రిలో చేరితే రూ. 5లక్షల వరకు చికిత్స ఉచితం. దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆస్పత్రుల్లో 1000కి పైగా వ్యాధులకు దీని ద్వారా ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు.
నిజానికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. దాని కంటే ఆరోగ్యశ్రీ పథకమే మేలు అని అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ పథకం వద్దని ప్రధానికి ముఖం మీదే చెప్పానని అన్నారు. అంతేకాదు,అది ఎందుకు పనికిరాదని విమర్శించారు. అలాంటిది ఇటీవల ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.