ఎనిమిదేండ్ల దొరగారి పాలనలో కేసీఆర్కు కమీషన్లు, ప్రజలకు సమస్యలు; అంతేగా.. వైఎస్ షర్మిల ఫైర్
వైయస్ఆర్టీపి అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గం లో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలో దించారు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు.

కేసీఆర్ నియంత పాలనలో ప్రజల గోసలు అనేకం
రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు భారంగా మారాయని, ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూములు ఇవ్వలేదని వైయస్ షర్మిల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నియంత పాలనలో అవ్వా, తాతల బాధలు.. రైతులు, మహిళల గోసలు అనేకం అని వైయస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానంలో ఎవరిని కదిలించినా బాధలే, ఎవరిని పలకరించినా కన్నీళ్లే అంటూ వైఎస్ షర్మిల, ప్రజలు పడుతున్న బాధలను ఏకరువు పెట్టారు. ఎనిమిదేండ్ల దొర గారి పాలనలో కేసీఆర్ కు కమీషన్లు, ప్రజలకు సమస్యలు మిగిలాయి అంటూ కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటికో ఉద్యోగమని మాయమాటలు చెప్పి ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టాడు
కెసిఆర్ ఏ ఒక్క పథకం సరిగా అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఊడగొట్టాడని వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగమని మాయమాటలు చెప్పి ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టాడని వైయస్ షర్మిల ఆరోపించారు. ఉద్యమంలో పదవులే వద్దని,ఇప్పుడు కుటుంబం మొత్తానికి పదవులు కట్టబెట్టుకున్నాడని వైయస్ షర్మిల విమర్శించారు. ఓవైపు భూములు లాక్కుంటూ,మరోవైపు పన్నులు గుంజుతూ ప్రజల రక్తం తాగుతున్నాడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని విషయాల్లోనూ మోసమే.. దున్నపోతు తీరు కేసీఆర్ వైఖరి
ఉచిత ఎరువులు ఇస్తానని మోసం చేశాడని, ఎరువుల రేట్లు పెంచడాన్ని మండిపడ్డారు. ఆర్టీసీని బాగు చేస్తా అని చెప్పి.. సంస్థను అప్పుల్లోకి నెట్టి, చార్జీలు పెంచాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ అని చెప్పి.. కరెంట్ రేట్లు పెంచాలంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కెసిఆర్ స్పందించడం లేదని, ఆయన తీరు దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉందని వైయస్ షర్మిల విమర్శించారు.

కెసీఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి.. మండిపడ్డ షర్మిల
కెసీఆర్ కుటుంబంలో కూతురు, కొడుకు, మేనల్లుళ్ళు అందరికీ పదవులు ఇచ్చుకున్నారని, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణా అయ్యిందని మండిపడ్డారు. వైఎస్ హయాంలో రేషన్ లో భాగంగా పప్పులు, ఉప్పు, నూనె, గోధుమలు, బియ్యం అన్నీ ఇచ్చేవారని, కానీ కేసీఆర్ కేవలం దొడ్డు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇక ఆ దొడ్డు బియ్యం కేసీఆర్ కుటుంబం తింటుందా చెప్పాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ వైఎస్ షర్మిల తనదైన శైలిలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications