రెండేళ్లలో మాదే అధికారం: దీక్ష విరమించిన వైఎస్ షర్మిల, కేసీఆర్పై తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఆదివారం మధ్యాహ్నం విరమించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబసభ్యులు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 2017లో చనిపోయిన మురళీయాదవ్, 2021 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు అనే నిరుద్యోగి కుటుంబసభ్యులు ఆమెకు నిమ్మరసం ఇచ్చారు. వీరు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందినవారు కావడం గమనార్హం.
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్పై సంచలనం
దీక్ష విరమించిన వైఎస్ షర్మిల..
తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ రెండు రోజుల కిందట ఇందిరా పార్క్ వద్ద షర్మిల ఉద్యోగ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.పోలీసులు ఒక్క రోజు దీక్షకే అనుమతించినా 72 గంటలు కొనసాగిస్తానని షర్మిల ప్రకటించడంతో.. పోలీసులు అడ్డుకుని ఆమె నివాసానికి తరలించారు. దీంతో షర్మిల తన నివాసంలోనే దీక్ష కొనసాగించారు. దీక్ష విరమించిన అనంతరం ఆమె మాట్లాడారు.
నిరుద్యోగులను కేసీఆరే బలి తీసుకున్నారు..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను సీఎం కేసీఆర్ బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. 40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి తాను దీక్ష విరమిస్తున్నానని.. కానీ, జిల్లాల్లోని కార్యకర్తలు ఉద్యోగ నోటిఫికేషన్ల వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తారని తెలిపారు.
రెండేళ్లలో తెలంగాణలో తమదే అధికారమంటున్న షర్మిల
రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. ఏం చేసైనా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని మాటిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలేనని షర్మిల ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం సీఎం కేసీఆర్కు చిటికెలో పని అని అన్నారు.
Recommended Video
సీఎం కేసీఆర్ విఫలం..
సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారని, కానీ వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే టీఎస్ పీఎస్సీలో మొత్తం 11 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్క సభ్యుడితోనే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వచ్చే జులై 8న పార్టీ ప్రకటన చేస్తానని ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.