కేసీఆర్పై వైఎస్ షర్మిల కొత్త యుద్ధం: కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో గవర్నర్ వద్దకు పంచాయితీ!!
తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయం మొదలు పెట్టిన వైయస్ షర్మిల ఏ పోరాటం చేసిన పకడ్బందీగా, పక్కా వ్యూహంతో చేస్తున్నారు. గతంలో నిరుద్యోగుల సమస్యల పోరాటానికి నిరుద్యోగ నిరాహారదీక్షను ప్రారంభించి, ప్రతి మంగళవారం నేటికీ నిరుద్యోగ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాటల బాణాలను ఎక్కుపెడుతున్నారు. కెసిఆర్ కు సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక తాజాగా ఇటీవల కురిసిన వరదలకు కాళేశ్వరం పంప్ హౌస్ లు మునిగిపోవడం, ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టు సంస్థ మేఘ కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఐదుగురు కూలీలు మృతి చెందడం వంటి ఘటనలపై ఘాటుగా స్పందించిన వైఎస్ షర్మిల, తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ పై కొత్త సమరానికి రెడీ అయ్యారు.
తెలంగాణా నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు వైఎస్ షర్మిల ధర్నా
ఇప్పటికే మేఘా కంపెనీని, మేఘ కంపెనీ కృష్ణా రెడ్డిని టార్గెట్ చేస్తున్న వైయస్ షర్మిల, సదరు సంస్థ నుండి కెసిఆర్ కు భారీగా ముడుపులు అందుతున్నాయని, అందుకే ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నా, ప్రాజెక్టులు ముంపుకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు కు చెందిన మోటార్లు గోదావరి నదిలో ముంపుకు గురికావడంపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయం ముందు వైయస్సార్ టిడిపి అధినేత వైయస్ షర్మిల పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బాధ్యులైన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ రావుకు ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు వైయస్ షర్మిల.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో గవర్నర్ ను కలుస్తాం
ఇక అక్కడితో తగ్గకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రెండు రోజుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైయస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మేఘా కృష్ణారెడ్డి నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ నిర్వహించాలని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైయస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఇక విచారణ నివేదిక వచ్చేవరకు మేఘ కృష్ణా రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ హోల్డ్ లో పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. కాళేశ్వరం వరద పాలైందని లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ పాలయ్యాయని పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వైయస్ షర్మిల ఆరోపిస్తున్నారు.
ఒక్కరికే 80శాతం ప్రాజెక్టులు కట్టబెట్టడం దేశంలోనే ఎక్కడా లేదు
తెలంగాణ కాంట్రాక్టర్లు క్వాలిఫై కాలేదని ఆంధ్రా కాంట్రాక్టర్ కు ప్రాజెక్టులు కట్టబెట్టారట కెసీఆర్ అంటూ మండిపడ్డారు. అందుకే ప్రాజెక్టులన్నీ మేఘాకే ఇచ్చారట. కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి దోస్తులు కాబట్టే తెలంగాణ సొమ్మును పట్టపగలే దోచుకుతింటున్నారు అంటూ విమర్శించారు. కాళేశ్వరం నా చెమట, నా రక్తం అన్న కేసీఆర్..మూడేండ్లకే కూలిపోతే ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? చెప్పాలన్నారు . కాళేశ్వరం కేసీఆర్ కమీషన్ల ప్రాజెక్టు మాత్రమే. ఒక్కరికే 80శాతం ప్రాజెక్టులు కట్టబెట్టడం దేశంలోనే ఎక్కడా లేదు. తెలంగాణ తెచ్చుకుంది వీళ్లిద్దరి కోసమేనా? అంటూ ప్రశ్నించారు.
మేఘా కృష్ణారెడ్డిని కాపాడుతుంది కేసీఆర్ నే
కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన నష్టానికి కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి నుండి నష్టపరిహారాన్ని వసూలు చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేస్తున్నారు. కెసిఆర్, మేఘా కృష్ణారెడ్డి ఇద్దరూ ఆర్థిక లావాదేవీల విషయంలో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్న వైయస్ షర్మిల మేఘా కృష్ణారెడ్డిని దోషిగా నిలబెట్టక పోవడం వెనుక కెసిఆర్ కు అందుతున్న ముడుపులే కారణమని ఆరోపణలు గుప్పించారు వైఎస్ షర్మిల.
ప్రాజెక్ట్ ల విషయంలోనూ వైఎస్ షర్మిల స్టాండ్... ఇక సమరమే అంటున్న వైఎస్ తనయ
ఒక్క ప్రాజెక్టుల విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా ఒక స్టాండ్ తీసుకొని దానికి కట్టుబడి తనదైన శైలిలో ఒంటరిగా పోరాటం చేస్తున్నారు వైయస్ షర్మిల. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలోని ప్రధాన అంశాలపై బలంగా టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చెయ్యలేక పోతున్న సమయంలో వైయస్ షర్మిల మాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ను, టిఆర్ఎస్ ప్రభుత్వ తీరును కడిగిపారేస్తున్నారు. ప్రజా ప్రస్థాన పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వారికి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇస్తూ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల సాగిస్తున్న రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా మారింది.