నీళ్ళు కూడా తాగనంటున్న వైఎస్ షర్మిల.. మద్దతుగా విజయమ్మ; ఆరోగ్యం క్షీణిస్తుందంటున్న వైద్యులు
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తన ఇంటి నుండే రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. తనకు పాదయాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలని, పోలీసులు అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే వైయస్ షర్మిల కనీసం మంచి నీళ్ళు కూడా తాగకుండా నిరాహారదీక్ష చేస్తున్న క్రమంలో వైద్యులు ఆమె ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షర్మిల ఆరోగ్యం నీళ్ళు కూడా తాగకపోవటంతో క్షీణిస్తుందన్న వైద్యులు
వైయస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష లోటస్ పాండ్ లో రెండో రోజు కొనసాగుతోంది. అయితే వైయస్ షర్మిల నీళ్లు కూడా తాగకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు గుర్తించారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెను కనీసం మంచి నీళ్ళు అయినా తీసుకోవాల్సిందిగా సూచించారు. మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో షర్మిల శరీరం డీహైడ్రేట్ అవుతుందని, ఇలాగే కొనసాగితే కిడ్నీలకు ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుందని అపోలో డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. షర్మిలకు బ్లడ్ టెస్ట్ నిర్వహించిన వైద్యులు ఆమె కనీసం నీళ్లు అయినా తాగాలని సూచిస్తున్నారు.
షర్మిలకు మద్దతుగా దీక్షలో విజయమ్మ.. లోటస్ పాండ్ వద్ద కర్ఫ్యూ
ఇదిలా ఉంటే వైయస్ షర్మిల పోరాటానికి మద్దతుగా తల్లి విజయమ్మ కూడా దీక్షలో కూర్చున్నారు. షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను లోపలకు పోనివ్వకుండా అడ్డుకుంటూ, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులను పలువురిని అరెస్టు చేస్తున్నారు. దీనిపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఎక్కడ దౌర్జన్యం అంటూ నిలదీస్తున్నారు. మీరు, మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు కానీ ప్రజల పక్షాన కొట్లాడే వైయస్సార్ తెలంగాణ పార్టీని మాత్రం ప్రశాంతంగా నిరాహార దీక్షలు కూడా చేసుకోనివ్వడు కేసీఆర్ అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేశారు.
కర్ఫ్యూ ఎత్తేసేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదు వైయస్ షర్మిల.. ట్వీట్
పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లు వేస్తున్నాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు . హైకోర్టు నుంచి పాదయాత్రకు అనుమతి ఉన్నా.. కేసీఆర్ నియంత పాలనలో న్యాయస్థానానికి గౌరవం లేదు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు అంటూ మండిపడ్డారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులను విడుదల చేసేంత వరకు, పార్టీ శ్రేణులను ఆపే ఈ కర్ఫ్యూ ఎత్తేసేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదు వైయస్ షర్మిల అంటూ దీక్షలో భీష్మించుకు కూర్చున్నారు వైఎస్ షర్మిల.
నియంత కేసీఆర్ ఎందుకీ కర్ఫ్యూ.. షర్మిల ఆగ్రహం
కేసీఆర్ & బ్యాచ్ బి ఆర్ ఎస్ సంబరాలు చేసుకోవచ్చు కానీ అదే రోజు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తే మాత్రం అరెస్టులు... నిర్బంధాలు చేస్తారా? నియంత కేసీఆర్ ఎందుకు ఈ కర్ఫ్యూ? అటు వైయస్ షర్మిల నిలదీశారు. తన పాదయాత్ర కు అనుమతి ఇచ్చే వరకు, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలను విడుదల చేసే వరకు తన నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.