గడీ దాటి బయటకు రా కేసీఆర్.. వరదబాధితులను ఆదుకో దొరగారు: ఏకిపారేసిన వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో గోదావరికి వచ్చిన వరదలు, రాష్ట్రంలో విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద అన్నారం పంప్ హౌస్ నీటమునిగింది. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తడంతో అనేకచోట్ల ప్రాజెక్టుల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సమీప ప్రాంతాలలో అనేక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా, అరకొర సహాయం అందిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కల్వకుంట్ల కుటుంబం సంచులు సవరించుకుంటుంది
ఇక తాజాగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలో వరద పరిస్థితిపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల టార్గెట్ చేశారు. మునిగిన కాళేశ్వరం పంపుహౌజ్ లు అంటూ పేర్కొన్న వైయస్ షర్మిల కెసిఆర్ అవినీతిపై విరుచుకుపడ్డారు. మరో లక్ష కోట్లు అప్పుచేసైనా సరే మునిగిన పంప్ హౌజ్ ను పైకి లేపబోతున్న దొరగారు అంటూ సెటైర్లు వేశారు. కెసిఆర్ ఏం చేసినా సరే మళ్లీ ప్రాజెక్టు మునకే అంటూ మెగా కృష్ణా రెడ్డి చెప్పారని వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఇక అధికారులు అప్పల కోసం పరుగులు పెడుతుంటే, కల్వకుంట్ల కుటుంబం సంచులు సవరించుకుంటుంది అంటూ వైయస్ షర్మిల కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు.
పాలాభిషేకాలు చేయడానికి భజన బ్యాచ్ రెడీగా ఉంటారు
ఇక ఇంత జరుగుతుంటే పాలాభిషేకాలు చేయడానికి భజన బ్యాచ్ రెడీగా ఉంటుందంటూ వైయస్ షర్మిల టిఆర్ఎస్ పార్టీ నాయకులు తీరుపై విరుచుకుపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోలేదంటూ మండిపడిన వైయస్ షర్మిల ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అంటూ టార్గెట్ చేశారు. వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? కనీసం ఏరియల్ సర్వే అయినా చేశాడా? అంటూ ప్రశ్నించారు.
గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొట్టుడా నీ పాలన?
జనం బాధల్లో ఉంటే గుండె ధైర్యం ఇవ్వాల్సింది పోయి గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొట్టుడా నీ పాలన? అని వైయస్ షర్మిల కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల మీద పెడుతున్న శ్రద్ధ, పావొంతైనా వరదల మీద పెడితే నష్టం కొంచమైనా తగ్గేది అంటూ వైయస్ షర్మిల సూచించారు. వారం రోజులుగా జనాలు వరదల్లో చిక్కుకొని చస్తుంటే పదిహేను లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయిన రైతన్నలు కన్నీరు పెడుతూ ఉంటే కెసిఆర్ పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.
ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం లేదా కేసీఆర్
రోడ్లు కొట్టుకుపోయి రోడ్డు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి రవాణా స్తంభిస్తుంటే, వైద్యం అందించాల్సిన దవాఖానాలు మునిగిపోతుంటే ఆదుకోవాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. గడీ దాటి బయటకు రా కేసిఆర్.. బాధితులను ఆదుకో.. అంటూ వైయస్ షర్మిల వరదల సమయంలో కూడా కేసీఆర్ బయటకు రాడా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వరద బాధితులను ఆదుకోవాలంటూ వైయస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు.