ఖమ్మం రాజకీయాల్లో షర్మిల భారీ స్కెచ్ - అన్నను మించిపోతారా..!?
వైఎస్ షర్మిల కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పాలేరు నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించారు. ఇందు కోసం భారీ స్కెచ్ సిద్దం చేస్తున్నారు. తండ్రి వైఎస్సార్ ను గుర్తు చేస్తూ సొంత నిధులతో కొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు. విద్య- వైద్య రంగాల్లో అవసరాల్లో ఉన్న వారికి సొంత నిధులతో అండగా నిలవాలని భావిస్తున్నారు. పేదలు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్దిక సాయం అందించేందుకు ప్లాన్ సిద్దం అవుతోంది. ఇక పాలేరు కేంద్రంగా షర్మిల తన యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. సంక్షేమ పాలనలో ఏపీ సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ గా వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు షర్మిల కూడా పాలేరులో సంక్షేమ బాటలోనే ప్రజలకు దగ్గరయ్యేలా కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.
సొంత నిధులతో సంక్షేమం అమలు..
తాను పోటీ చేస్తున్న పాలేరు కేంద్రంగా సంక్షేమం అందించేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సొంత నిధులతో కార్యక్రమాల అమలుకు ప్లాన్ సిద్దం అవుతోంది. వైద్యం - విద్య రంగాల్లో పేదలకు అండగా నిలవాలని నిర్ణయించారు. అందులో భాగంగా..ఆరోగ్య శ్రీ కార్డు తరహాలోనే పేదలకు వైద్యం పొందేందుకు వీలుగా గుర్తింపు కార్డులను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో సొంత నిధులతో ప్రతీ మండలంలోనూ అంబులెన్సుల ఏర్పాటుకు నిర్ణయించారు. విద్యార్ధులకు ఉన్నత చదువులకు ఇబ్బంది లేకుండా ఏ రకంగా అండగా నిలవాలనే అంశం పైన కసరత్తు జరుగుతోంది. వైఎస్సర్ సంక్షేమం అందిస్తానని చెబుతున్న షర్మిల..ముందుగా తాను పోటీ చేయనున్న పాలేరు కేంద్రంగా వీటిని అమలు చేసేందుకు ముందుడుగు వేస్తున్నారు.
ఆరోగ్య కార్దులు - పార్టీ నుంచి ఫీజులు చెల్లింపు
పేదలకు ఉచిత వైద్యం ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించారు. ఇందు కోసం ఖమ్మంలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఖమ్మంలోనే కాకుండా అవసరమైన వారికి హైదరాబాద్లో కూడా ఉన్నత స్థాయి వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరించేలా ప్లాన్చేస్తున్నారు. పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్అందించేందుకు ఎంపిక చేసిన పాఠశాలలతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేదరిక కారణంగా ఉన్నత చదువులకు దూరమైన వారికి అవసరమైతే సాయం అందించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో పేదలు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి రూ 10 వేల చొప్పున సాయం అందిస్తున్నారు. దీనికి పెంచి రూ 25 వేలకు అందించే ఆలోచన పైన పార్టీలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత మందికి ఈ మొత్తంలో పార్టీ నుంచి సాయం అందించారు.
పాలేరు కేంద్రంగా షర్మిల కీలక నిర్ణయాలు..
ప్రస్తుతం షర్మిల విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 19న హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఆ వెంటనే పాలేరులో పర్యటించనున్నారు. షర్మిల పాలేరు పర్యటన వేళ కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కొనుగోలు చేసిన 2 వేల గజాల స్థలంలో షర్మిల భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి ఏరియాలో ఆఫీస్ తో పాటు ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలను ముందుగా సొంత డబ్బులతో షర్మిల అమలు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం కేంద్రంగా బీఆర్ఎస్ - బీజేపీ రాజకీయం వేడెక్కుతున్న వేళ..పాలేరులో షర్మిల నిర్ణయాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.