హుజూరాబాద్లో వైఎస్ షర్మిల పర్యటన: నిరుద్యోగ దీక్ష, ఉపఎన్నికపై కీలక ప్రకటన చేస్తారా?
కరీంనగర్: మంగళవారం నిరుద్యోగ దీక్షలను కొనసాగిస్తున్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ(వైయస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇందులో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన మహ్మద్ షబ్బీర్ అనే నిరుద్యోగి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సిరిసేడులో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష
ఈ క్రమంలో షబ్బీర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. షబ్బీర్ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న షర్మిల.. ఈ మంగళవారం సిరిసేడులో దీక్షలో కూర్చున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతంది. షర్మిల పర్యటన సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీకి చెందిన పలువురు నేతలు దీక్ష శిబిరానికి చేరుకున్నారు.

ఉపఎన్నికలో గెలుపు కోసం శ్రమిస్తున్న ఈటల రాజేందర్
కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈటల రాజేందర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చారు. తనను గెలిపించాలంటూ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటకే హుజూరాబాద్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, నేతలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాక, తనను చంపేందుకు కూడా కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికలో గెలుపు తనదేనని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక గెలుపే లక్ష్యంగా కేసీఆర్ పథకాలు
మరోవైపు, హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే హుజూరాబాద్ కు చెందిన పలువురు కీలక నేతలను టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారు. అంతేగాక, దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు అందజేసే దళితబంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే పైలట్ ప్రాజెక్టుగా చేపడుతోంది కేసీఆర్ సర్కారు. ఇప్పటికే ఇందు కోసం రూ. 500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కరీంనగర్ జిల్లా కలెక్టర్కు అందజేసింది. హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ సర్కారు, టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ఇతర టీఆర్ఎస్ నేతలు హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పెద్దగా దృష్టి సారించలేదని చెప్పాలి.

హుజూరాబాద్లో వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేస్తారా?
ఈ నేపథ్యంలో హుజూరాబాద్లో వైఎస్ షర్మిల పర్యటించడం ఆసక్తికరంగా మారింది. అయితే, హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయబోదని గతంలోనే షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికేనని షర్మిల వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ పర్యటన సందర్భంగా కేసీఆర్ సర్కారుపై వైఎస్ షర్మిల ఎలాంటి విమర్శలు చేస్తారు? హుజూరాబాద్ ఉపఎన్నికపై తాజాగా ఏదైనా కీలక ప్రకటన చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే కేసీఆర్ సర్కారుపై నిరుద్యోగంతోపాటు పలు సమస్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications