కృష్ణంరాజు సతీమణికి విజయమ్మ పరామర్శ - వైఎస్సార్ తో అనుబంధంపై..!!
దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఇటీవల కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసారు. కృష్ణంరాజు మరణంతో అటు టాలీవుడ్ తో పాటుగా రాజకీయ రంగంలోని పలువురు షాక్ అయ్యారు. ఆయన మరణం పట్ల దిగ్భాంత్రి వ్యక్తం చేసారు. రెబల్ స్టార్ గా సినిమాల్లోనే కాకుండా.. వ్యక్తిగతంగానూ రారాజుగా ఉండేవారని కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి.. మోహన్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ..పలువురు దర్శకులు..రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు.
బీజేపీ నేతలు కృష్ణంరాజు భౌతిక కాయం పైన పార్టీ జెండా ఉంచి అంజలి ఘటించారు. ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేసారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాధ్ సింగ్ హైదరాబాద్ కు వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రభాస్ తో పాటుగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.కృష్ణంరాజు సంస్మరణ సభలోనూ పాల్గొని.. తొలుత గోవధ నిషేధం బిల్లు ప్రతిపాదించింది కృష్ణంరాజు అని గుర్తు చేసారు. ఇక, ఇప్పుడు వైఎస్ విజయమ్మ కృష్ణంరాజు సతీమణి తో పాటుగా వారి కుమార్తెలను పరామర్శించారు.
కృష్ణంరాజు - వైఎస్సార్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కృష్ణంరాజు తనకు వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని స్వయంగా చెప్పుకొచ్చారు. రాజకీయం రంగంలో కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచే ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. నాటి ప్రధాని వాజ్ పేయ్ హయాంలో పలు శాఖలను నిర్వహించారు.