పట్టువదలని షర్మిళ.!ఎట్టకేలకు అనుమతి.!శనివారం ధర్నాచౌక్ లో రైతు వేదన దీక్ష.!
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనబోమని చెబుతున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల శనివారం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు, ధర్నా చౌక్ , ఇందిరా పార్క్ హైదరాబాద్ వద్ద "రైతు వేదన" నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్నట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 72 గంటల పాటు పర్మిషన్ కోరినా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వని కారణంగా శనివారం ఉదయం ఇందిరాపార్కు వద్ద రైతు వేదన దీక్ష చేసి, మిగతా 48గంటల పాటు లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో రైతు వేదన దీక్ష కొనసాగిస్తారని తెలుస్తోంది. ఈ నిరాహార దీక్షకు పార్టీ అధికార ప్రతినిధులు, పార్లమెంట్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,యువజన విభాగం,దళిత, బీసీ, మైనారిటీ, గిరిజన విభాగం నాయకులు పార్టీ నాయకులు రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మద్దతు ధరకు పంట పొలంలోనే వడ్లు కొంటామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ నిచ్చి మాట మారుస్తోందని వైయస్సార్ టీపి మండిపడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఎందుకు చేస్తుందో రైతులకు అర్థం కావడం లేదని, సన్న వడ్లు వేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి, ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులపై వైసీపి నేతలు మండిపడుతున్నారు. పోయిన సంవత్సరం సన్న వడ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం కొనక పోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసిందో రైతులకు అగమ్యగోచరంగా ఉందని, పక్క రాష్ట్రాలో మద్దతు ధరకు మించి క్వింటాల్ కి 500 రూపాయలు చెల్లిస్తున్నారని వైసీపి తెలంగాణ నేతలు చెప్పుకొస్తున్నారు. నేడు ఎకరానికి సరాసరిగా 28 క్వింటాళ్లు ధాన్యం పండుతుంటే 12,500 రూపాయలు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రైతాంగం నష్టపోతోందని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు నిద్రాహారాలు మాని వడ్లు కొనాలని వరి పంటను రోడ్డుపై, పంట పొలాల్లో కుప్పలుగా పోసి ఎదురుచూస్తున్నారని, వారికి న్యాయం చేసేందుకే షర్మిళ దీక్ష చేస్తున్నారని వైయస్సార్ టీపి నేతలు స్పష్టం చేస్తున్నారు.