మీరు చేస్తే పుణ్యకార్యాలు ? .. మేము చేస్తే పాప కార్యాలా ?.. కేటీఆర్ను అరెస్ట్ చేయాల్సిందే : షర్మిల నిప్పులు
కేసీఆర్ సర్కార్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. కరోనా నిబంధనల పేరుతో ప్రతిపక్షాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఆంక్షలు ప్రతిపక్షాలకేనా..? అధికార పార్టీకి వర్తించవా..? అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభలు , సమావేశాలు పోలీసులకు కన్పించవా.?. వారిని అడ్డుకోవడం చేతకావడం లేదా? అని నిలదీశారు. కేటీఆర్కు స్వాగతం పలికే ర్యాలీలకు, సభలకు ఆంక్షలకు అడ్డురావా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ఉల్లంఘించిన కేటీఆర్పై కేసు పెట్టాల్సిందేన్నారు.
టీఆర్ఎస్ చేస్తే పుణ్యకార్యాలు.. మేము చేస్తే పాప కార్యాలా?
రైతుల మంచి కోసం తాము చేసే పనులు పాప కార్యాలతోను.. అధికారం కోసం టీఆర్ఎస్ నాయకులు పెట్టే సమావేశాలు పుణ్యకార్యాలతోనూ పోల్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ 3వేల బైక్ లతో ర్యాలీ నిర్వహించడంపై ఆమె ఘాటుగా స్పందించారు. బైక్ ర్యాలీకి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ లో ఫోస్ట్ చేశారు. ప్రతిపక్షాలకు ఉన్న రూల్స్ .. పాలకపక్షానికి ఉండవా? అని నిలదీశారు.
కేటీఆర్పై కేసు పెట్టాల్సిందే..
అన్నదాతల చావులు చూడని గుడ్డి పాలన కేసీఆర్ దని మండిపడ్డారు షర్మిల. రైతుల ఆవేదనను వినిపించుకోని చెవిటి పాలన రాష్ట్రంలో నడుస్తోందని విమర్శించారు. రైతన్నల చావులను ఆపాలని, ఆ కుటుంబాలలో ధైర్యాన్ని నింపడానికి తాము రైతు ఆవేదన యాత్ర చేస్తుంటే అడ్డుకోవడానికి గుర్తొచ్చే కరోనా నిబంధనలు.. చిన్న దొరగారికి స్వాగతం పలికే ర్యాలీలకు, చిన్నసారు సభలకు అడ్డురావా? అని ట్విట్ చేశారు. పోలీసుల ఆంక్షలు ప్రతిపక్షాలకేనా? KTR మీద కేసెందుకు పెట్టరు? పెట్టాల్సిందేనన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికుందని నిరూపించాల్సిందేనని పేర్కొన్నారు.
కేసీఆర్ ఆడుతున్న రాజకీయ, రాక్షస క్రీడలో..
రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర అంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు షర్మిల. సీనియారిటీ చిచ్చు పెట్టి G.O. 317 యమపాశంతో ఓ ప్రధానోపాధ్యాయుడుని బలి తీసుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. G.O. 317తో ఆగమైతున్నామని ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నా, ఉసురు తీసే పనిపెట్టుకున్నారు.లేని సమస్యలను సృష్టిస్తూ.. కేసీఆర్ ఆడుతున్న రాజకీయ, రాక్షస క్రీడలో ఉపాధ్యాయులను బలిపశువులను చేస్తున్నారని దుయ్యబట్టారు.
మీ అనాలోచిత నిర్ణయాలు, అహంకార పోకడలు పక్కనపెట్టి మరొకరు చనిపోకముందే G.O. 317ను రద్దు చేయాలన్నారు. ఉపాధ్యాయులు లేవనెత్తే అంశాలను పరిశీలించి, శాస్త్రీయ పద్ధతిలో బదిలీలు చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.