వైఎస్సార్టీపీ ఛలో ఖమ్మం జిల్లా: ఎల్లుండే..రూట్మ్యాప్ ఇదే: నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల
ఖమ్మం: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం పోరుబాట పట్టింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ను సాధించడమే లక్ష్యంగా నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు తెర తీసింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలకు పూనుకుంది. ఇందులో భాగంగా- ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
కృష్ణాజలాలపై వాటర్ ఏరోడ్రోమ్: ప్రకాశం బ్యారేజీపై: ఏపీ బీజేపీ అలర్ట్..కేంద్రానికి థ్యాంక్స్
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కిందటివారం వనపర్తి జిల్లాలో దీన్ని ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా ఈ మంగళవారం ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో గల పెనుబల్లి మండలం గంగదేవిపాడులో నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన రూట్మ్యాప్ను వైఎస్ఆర్టీపీ నాయకులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది.
ఇందులో పాల్గొనడానికి మంగళవారం తెల్లవారు జామున 5 గంటలకు వైఎస్ షర్మిల.. ఖమ్మం జిల్లాకు బయలుదేరి వెళ్తారు. ఎల్బీ నగర్, సూర్యాపేట్, ఖమ్మం బైపాస్, తల్లాడ, టేకులపల్లి మీదుగా గంగదేవిపాడుకు చేరుకుంటారు. గంగదేవిపాడుతో పాటు పెనుబల్లిలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు న్యాయం చేయడానికి తాము ఎంత వరకైనా పోరాడతామని వైఎస్ షర్మిల చెబుతోన్నారు. ఈ ప్రయత్నంలో తమకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా లెక్కచేయబోమని స్పష్టం చేశారు.
50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. ఇప్పటిదాకా నోటిఫికేషన్ను ఎందుకు విడుదల చేయట్లేదని వైఎస్సార్టీపీ నాయకులు ప్రశ్నిస్తోన్నారు. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కేసీఆర్ చేసిన ప్రకటనను హుజూరాబాద్ ఉప ఎన్నిక స్టంట్గా అభివర్ణిస్తోన్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ను సాధించడమే తమ లక్ష్యమని, బంగారు తెలంగాణను నిర్మించాలంటే నిరుద్యోగాన్ని రూపుమాపాల్సి ఉంటుందని అంటోన్నారు.