Rahul-YS Sharmila : రాహుల్ కు షర్మిల లేఖ-కాంగ్రెస్ కు మద్దతు వెనుక సర్వే రిపోర్ట్స్ ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఒకప్పుడు తన అన్న వైఎస్ జగన్ ను జైల్లో పెట్టి వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మద్దతుకు కారణాలు తెలియజేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిల ఇవాళ లేఖ రాశారు. ఎక్స్ లో దీన్ని షేర్ చేశారు.
తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆయన కుటుంబ పాలన కారణంగా తెలంగాణ సంపద అంతా ఒకే కుటుంబం చేతిలో పోగుపడిందని షర్మిల తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్, ఆయన అనుచరుల అవినీతి కారణంగా భారీ అప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు. ఈ సమయంలో భావసారూప్య పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం వచ్చిందన్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. కేసీఆర్ పై ఉన్న ప్రజావ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వెల్లడించారు. తాజాగా వెలువడిన పలు సర్వేల ప్రకారం తాము బరిలో ఉంటే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు పడే ఓటు చీలిపోయే అవకాశం ఉందని తేలిందన్నారు. కాబట్టి తాము తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Time always gives us a choice that history will remember…and now is the opportunity to choose between the political interest and larger public interest. Today, I stand at this critical juncture of sacrifice, where the YSR Telangana Party has decided to back out from contesting… pic.twitter.com/98C6v1hFjg
— YS Sharmila (@realyssharmila) November 3, 2023
కాబట్టి తమ నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నామని, తమ పార్టీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో అండగా నిలుస్తాయని షర్మిల వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు మంచి ప్రదర్శన కనబరుస్తుందని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ లేఖతో పాటు ట్విట్టర్ పెట్టిన పోస్టులో భారాసా నీచపాలన అంతం కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధం. కేసీఆర్ అవినీతి రౌడీరాజ్యం అంతమొందించగలిగే కాంగ్రెస్ ఓటుచీల్చవద్దనే ఈ త్యాగం. YSR తెలంగాణ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నుండి తెలంగాణ బాగు, భవితకోసం వైదొలగుతోంది అంటూ షర్మిల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications