బీఆర్ఎస్ లో వైఎస్సార్టీపీ విలీనం కోసం...!!
తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్టీపీ తప్పుకున్నాయి. బీజేపీతో జనసేన పొత్తుతో పోటీలో ఉంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మద్య నడుస్తోంది. కీలక హామీలతో బీజేపీ రేసులోకి వస్తోంది. కాంగ్రెస్ లో విలీనం కోసం ప్రయత్నించిన షర్మిల ఆ తరువాత ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచారం చేస్తామని చెప్పినా ఇంకా ప్రారంభించలేదు. ఈ సమయంలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణలో పోటీ చేద్దామని ప్రతిపాదించి..కాంగ్రెస్ కోసం వెనక్కు తగ్గటం పైన షర్మిల నిర్ణయంతో పార్టీ నేతలు విభేదించారు. దీంతో, వారంతా పార్టీ వీడారు. వైఎస్సార్టీపీ నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలోచేరారు. మంత్రి హరీష్రావు సమక్షంలో గట్టు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరి చేరిక సమయంలో మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్టీపీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం అంటూ ఆహ్వానించారు.తండ్రి సమానులైన కేసీఆర్ను రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అంటూ విరుచుకుపడ్డారు.

సీఎం కేసీఆర్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా, పార్టీ నడపగలుగుతారా అని అవహేళన చేశారని గుర్తు చేసారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని అవహేళన చేశారని గుర్తుచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని అన్నారన్నారు. తెలంగాణ పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలు చేసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఇక, వైఎస్సార్టీపీ నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరటంతో షర్మిల ప్రకటించిన విధంగా కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారా..లేక కాంగ్రెస్ లో చేరుతారా అనే చర్చ ఇప్పుడు రాజకీయంగా మొదలైంది.












Click it and Unblock the Notifications