తిరుమలలో అచ్చెన్నాయుడు: కుటుంబంతో సహా: శ్రీవారికి మొక్కులు
తిరుపతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారు జామున ఆయన కుటుంబంతో సహా స్వామివారిని దర్శించారు. తలనీలాలను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వందల కోట్ల రూపాయల మేర అవినీతి చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న ఈఎస్ఐ కుంభకోణంలో ఆయనను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన రెండున్నర నెలలుగా ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో గుంటూరు జీజీహెచ్, ఆ తరువాత రమేష్ ఆసుపత్రి చేరారు. అక్కడ ఉన్న సమయంలోనే కరోనా వైరస్ బారిన పడ్డారు. దీనితో మరింత మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎన్ఆర్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై విడుదలైన వెంటనే ఆయన శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మాడకు బయలుదేరి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. రాధేయం అతిథిగృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు.
Recommended Video
ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. శ్రీవారి దయతో తన ఆరోగ్యం మెరుగుపడిందని అన్నారు. తనపై నమోదైన కేసులు కక్షపూరితమేనని, హైకోర్టు బెయిల్ ఇవ్వడమే దీనికి నిదర్శనమని చెప్పారు. ఈఎస్ఐ కుంభకోణం నుంచి తాను నిరపరాధిగా బయటికి వస్తాననే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉద్దేశపూరకంగా రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications