తిరుమలలో మరో చిరుతపులి చిక్కింది: రెండు నెలల్లో ఎన్నంటే?, భక్తులకు కర్రలు
తిరుపతి: తిరుమలలో చిరుతపులుల సంచారం భక్తులను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, తిరుమల(Tirumala) నడకమార్గంలో మరో చిరుత(Leopard) చిక్కింది. నడకమార్గంలో నరసింహస్వామి ఆయం-7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో చిరుతపులి చిక్కినట్లు అధికారులు తెలిపారు. దీంతో కలిసి రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు బంధించారు.
నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత కెమెరా కంటికి చిక్కింది. దాన్ని బంధించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ఇటీవల అలిపిరి నడకమార్గంలో చిరుతదాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాు చేసి చిరుతలను పట్టుకుంటున్నారు.

మరోవైపు, నడక మార్గంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. గత నెలలోనే అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుల్లో మూడు చిరుతలు చిక్కాయి. అంతకుముందు చిరుత కూనను పట్టుకున్నారు. తాజాగా మరో చిరుత చిక్కడంతో ఇప్పటివరకు ఐదు చిరుతపులులను పట్టుకున్నట్లయింది.
అలిపిరిలో భక్తులకు కర్రల పంపిణీ
అలిపిరి నడకమార్గంలో క్రూరమృగాల సంచారం నేపథ్యంలో అనేక భద్రతా చర్యలు తీసుకున్నామని, ఇందులో ఒక చర్యగా భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి చేతికర్రలు అందజేస్తున్నామని టీటీడీ ధరక్మర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద ఈవో ఎ.వి. ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ బుధవారం భక్తులకు చేతికర్రలను అందజేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. చేతికర్రలతో భక్తులు క్రూరమృగాలతో పోరాడతారని కాదని, చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా వెనకాడుతుందని శాస్త్రీయ పరిశీలన ద్వారా రుజువైందని చెప్పారు. వేల సంవత్సరాల నుంచి గ్రామాల్లో ప్రజలు పొలాలకు, అడవులకు వెళ్లేటప్పుడు చేతికర్రలను ఆసరాగా తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. యాత్రికులకు చేతి కర్రను ఇచ్చి టీటీడీ బాధ్యత తీరినట్టు భావించడం లేదని, భక్తులకు గుంపులుగా పంపుతున్నామని, వీరికి సెక్యూరిటీ గార్డు భద్రతగా ఉంటారని, అక్కడక్కడ పోలీసు సిబ్బంది కూడా రక్షణగా ఉంటారని తెలియజేశారు.
టీటీడీ చేపట్టిన చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటుచేసి ఇప్పటివరకు నాలుగు చిరుతలను బంధించామని తెలియజేశారు. కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చేతికర్రలను భక్తులకు ఉచితంగా అందిస్తామని, వీటిని అలిపిరిలో అందజేసి శ్రీ నరసింహస్వామివారి ఆలయం వద్ద తిరిగి తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications