తిరుమల శ్రీవారి సేవలో వైఎస్ జగన్: బియ్యంతో తులాభారం
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీనివాసుడి నామస్మరణతో ఏడుకొండలు ప్రతిధ్వనిస్తోన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈ సంవత్సరం కూడా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు.
రోజూవారి కోటా ప్రకారమే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. సోమవారం సాయంత్రమే ఆయన తిరుపతికి వచ్చారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద మెట్ల మార్గం పైకప్పు పనులు, గోమందిరాన్ని ప్రారంభించారు. కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
గరుడవాహన సేవలో పాల్గొన్నారు. వేదపండితులు ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనమిచ్చారు. అనంతరం 2022 టీటీడీ డైరీ, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. రాత్రి శ్రీ పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున 6 గంటలకు శ్రీవారిని దర్శించుకున్నారు వైఎస్ జగన్. స్వామిసేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చుకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. బియ్యంతో స్వామివారికి తులాభారం సమర్పించుకున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి ధనంజయ రెడ్డి, పాలక మండలి సభ్యులు ఆయన వెంట ఉన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో వైఎస్ జగన్కు ఆశీర్వచనాలు పలికారు.
Recommended Video
అనంతరం- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కొత్త ఛానళ్లకు ప్రారంభించారు. ఎస్వీబీసీ హిందీ, కన్నడ భాషల్లో ప్రసారం అయ్యే ఛానల్స్ అవి. ఎస్వీబీసీ-హిందీ, ఎస్వీబీసీ-కన్నడ చానల్స్ ఇప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు ఛానళ్లకు సంబంధించిన లోగోలను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి ఆనుకునే ఉన్న బూందీపోటును సందర్శించారు. కొత్తగా నిర్మించిన బూందీపోటును ముఖ్యమంత్రి ప్రారంభించారు.