వైకుంఠ ఏకాదశి.. తిరుమలలో మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం..
తెలంగాణ మంత్రి హరీష్ రావుకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అయితే టీటీడీ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా హరీష్ రావును అవమానించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన దర్శనానికి వెళ్లేందుకు విముఖత చూపించారు. చివరకు టీటీడీ పాలకమండలి చొరవతో ఆయన మనసు మార్చుకుని దర్శనానికి వెళ్లారు.
కేసీఆర్ లాగే హరీష్ రావుకు దైవ భక్తి..
తెలంగాణ సీఎం,మేనమామ కేసీఆర్ లాగే హరీష్ రావుకు కూడా దైవ భక్తి ఎక్కువ. ఏడాదిలో మూడు,నాలుగు సార్లయినా ఆయన తిరుమలను దర్శిస్తారు. సోమవారం ముక్కోటి ఏకాదశి కావడంతో హరీష్ రావు తిరుమల స్వామి దర్శనానికి వెళ్లారు.
ముక్కోటి ఏకాదశి విశిష్టత
ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా పిలవబడే ఈ పండుగ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతలతో కలిసి విష్ణువు దర్శనమిస్తారు కాబట్టి.. ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఏకాదశి రోజు ఉపవాసం,ద్వాదశి రోజు అన్నదానం చేస్తే శుభం కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున్న సాధారణ ప్రజలు, రాజకీయ నేతలు, ప్రముఖులు తిరుమల పుణ్యక్షేత్రానికి పోటెత్తుతారు. ఈ క్రమంలోనే హరీష్ రావు దర్శించుకోగా, అధికారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది.
ఏకాదశి నియమాలు
ఏకాదశి సందర్భంగా చేసే వ్రతానికి ఏడు నియమాలు ఉన్నట్టు చెబుతారు. అందులో ఒకటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. దశమి నాడు రాత్రి ఆహారం భుజించరాదు. స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలి.అబద్దాలు చెప్పరాదు. రాత్రంతా జాగరణ చేయాలి. చెడు పనులు చేయరాదు. అన్నదానం చేయాలి. ఈ ఏడు నియమాలు పాటిస్తే ముక్కోటి ఏకాదశి వ్రతం ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతారు.
పవిత్ర ఏకాదశి.. :
ప్రతీ మాసంలో రెండు ఏకాదశులు రావడం సర్వసాధారణం. అయితే అన్నింటిల్లో అత్యంత పవిత్ర ఏకాదశిగా పుశ్యశుద్ద ఏకాదశి ప్రాచుర్యం పొందింది. ఏకాదశికి సంబంధించి పలు పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. విష్ణువుకు తులసీ,జాజిపూలు ప్రీతిపాత్రమైనవి కావడంతో.. వాటితో విగ్రహాలను అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు పుత్ర సంతానం కలుగుతుందన్న ప్రచారం కూడా ఉంది.