తిరుమలలో ఆ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 24, 25, నవంబర్ 8న బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. 24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(ttd) వెల్లడించింది. సూర్యగ్రహణం రోజున ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు, చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసేస్తారు. గ్రహణాల రోజుల్లో ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. కేవలం సర్వదర్శన భక్తులను మాత్రమే ttd అనుమతించనుంది.

కొండ కింద గదుల కేటాయింపు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు త్వరలోనే తిరుపతిలో కూడా తిరుమల తరహాలో గదులను కేటాయించబోతున్నారు. దీంతో కొండపైన గదులు దొరకని భక్తులకు కొండ కింద వసతి సౌకర్యం అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా గతంలో ఉన్న టైమ్ స్లాట్ టోకెన్లను కూడా టీటీడీ అందుబాటులోకి తీసుకురాబోతోంది. గతంలోనే ఈ సౌకర్యం ఉన్నప్పటికీ కరోనా నుంచి అన్నింటినీ టీటీడీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లు
టైమ్ స్లాట్ పై టోకెన్లు పొందిన భక్తులు తిరుపతిలోనే బస చేసి కొండపైకి రావాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. రాత్రి నుంచి క్యూలైన్లలో వేచివున్న భక్తులకు సత్వరమే దర్శనం చేయించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 10.00 గంటలకు మార్చారు. కార్తీక మాసంలో గత ఏడాది జరిగినట్లుగానే విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు, రంపచోడవరం, అరకు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నారు.

ఇకనుంచి అన్ని స్టాల్స్ లో లడ్డూల విక్రయం
కొండపైన వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా క్యూ ఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని స్కాన్ చేయగానే తిరుమల పైన ఉండే దేవాలయాలు, కార్యాలయాలు, వాటి సేవలు సేవకులు తెలుసుకోగలుగుతారు. త్వరలో భక్తుల కోసం కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు లడ్డూ విక్రయశాలలో కొన్ని స్టాల్స్ లోనే అమ్మకాలు సాగించేవారు. ఇక నుంచి అన్ని స్టాల్స్ లో విక్రయాలు జరపబోతున్నారు. . సెప్టెంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.122.19 కోట్లు వచ్చింది.












Click it and Unblock the Notifications