టీటీడీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్- 20 ఏళ్ల కల సాకారం
తిరుపతి: తిరుపతి సరికొత్త హంగులను సమకూర్చుకుంటోంది. కొత్త సొబగులను అద్దుకుంటోంది. ఇప్పటికే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. త్వరలో ఇది వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వంతెనను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం శ్రీనివాస సేతు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ ఫ్లైఓవర్ మంజూరయింది. దీని మొత్తం నిర్మాణ వ్యయం 680 కోట్ల రూపాయలు. ఇదివరకే ట్రయల్ రన్ను చేపట్టారు అధికారులు.

ఈ నెల 18వ తేదీన వైఎస్ జగన్ తిరుమలను సందర్శించనున్న విషయం తెలిసిందే. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆ రోజున ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అదే రోజున శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను కూడా ప్రారంభించనున్నారు. దీనికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
తన పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఇది వారి సుదీర్ఘ డిమాండ్. ఎంతోకాలంగా వారు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తూ వస్తోన్నారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ పాలక మండలి కావడం వల్ల అందులో పని చేసే ఉద్యోగులకు ఇళ్ల పట్టాలకు అర్హులు కాదని ఇన్నాళ్లూ ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

దీనికి జగన్ ప్రభుత్వం పరిష్కారం చూపింది. టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం 310 ఎకరాలను మంజూరు చేసింది కూడా. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించింది టీటీడీ.
ఆయన హఠాన్మరణానంతరం ఈ ప్రతిపాదనలు అమలు కాలేదు. ఇప్పుడు తాజాగా మళ్లీ వైఎస్ జగన్ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాల ప్రతిపాదనలపై ఆమోదం తెలిపారు. వడమాల పేట వద్ద టీటీడీ ఉద్యోగులకు 35-55 అడుగుల ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. 18వ తేదీన వారికి పట్టాలను అందజేస్తారు.












Click it and Unblock the Notifications