టీటీడీలో గందరగోళం: పాలక మండలి సభ్యుడి పేరుతో మరొకరు: చివరకు ఇలా..!
ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకార విషయంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 36 మందితో కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసారు. అందులో ఇప్పటికే 24 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. మిగిలిన సభ్యులు చేయటానికి..వారికి టీటీడీ అధికారులు సమాచారం ఇచ్చారు. వారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయటానికి సిద్దంగా ఉన్నదీ సమాచారం సేకరించారు.
అందులో భాగంగా ప్రభుత్వం రాజేశ్ శర్మ పేరుతో ఒకరిని బోర్డు సభ్యుడిగా ఖరారు చేసింది. అయితే..దేవాదాయ శాఖ అదే విధంగా టీటీడీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళం ఏర్పడింది. ఇదే పేరుతో మరో వ్యక్తి టీటీడీ అధికారుల ముందకు వచ్చారు. దీంతో..అసలు రాజేశ్ శర్మ ఎవరనే అంశం పైన డైలమా ఏర్పడింది. చివరకు ఎట్టకేలకు అసలు సభ్యుడిని ఖరారు చేసుకున్న టీటీడీ ఆయనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది.
టీటీడీలో సభ్యుడి పేరులో గందరగోళం..
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన బోర్డులో ఒక సభ్యుడి ప్రమాణ స్వీకారం సమస్యకు కారణమైంది. టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్ శర్మ పేరుతో సభ్యుడిగా నియమితులైన ఆ వ్యక్తి ఎవరనేది ఒక దశలో టీటీడీ అధికారులకు సమాచారం లేదు. దేవాదాయ శాఖ నుండి వచ్చిన సమాచారం మేరకు అదే పేరుతో ఉన్న వ్యక్తికి టీటీడీ అధికారులు సమాచారం పంపారు. అక్కడే అసలు టీటీడీని తికమకపెట్టింది. మొత్తంగా 36 మందితో ఏర్పాటైన జంబో బోర్డులో ఇప్పటికే 24 మంది సభ్యులు, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇంకా సభ్యుల్లో డీపీ అనంత, సుధా నారాయణమూర్తి, రాజేశ్శర్మ, రమేశ్ శెట్టి, ప్రత్యేక ఆహ్వానితుల్లో గోవిందహరి ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే రాజేశ్ శర్మ పేరుతో మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి, ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి టీటీడీ ముందుకు వచ్చారు. వీరిలో నియమితులైన సభ్యుడెవరో.. ఎవరి చేత ప్రమాణం చేయించాలో అర్థంగాక టీటీడీలో గందరగోళం ఏర్పడింది. దేవాదాయ శాఖ ఇచ్చిన సమాచారం మేరకే తాము వ్యవహరించామని టీటీడీ చెబుతోంది.

చివరకు ఇలా పరిష్కరించారు..
ఒక కేంద్ర మంత్రి తో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు ముంబాయికి చెందిన రాజేష్ శర్మను ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుడగా నియమించింది. అయితే సమన్వయం లోపంతో దేవాదాయ శాఖ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలియని టీటీడీ అక్టోబర్ 3న ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో సభ్యుడిగా నియమితులైన అసలు రాజేష్ శర్మ తిరుమలకు రావడంతో గందరగోళం ఏర్పడింది. ఈ విషయాన్ని ముంబైకి చెందిన రాజేష్ శర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో తప్పిదం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఇప్పుడు అక్టోబర్ 5న ముంబైకి చెందిన రాజేష్ శర్మతో ప్రమాణస్వీకారం చేయించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ వ్యవహారం మీద ప్రభుత్వం వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. సభ్యుడిగా ఎవరిని నియమించిందీ..వారి బయోడేటాతో సహా మొత్తం సమాచారం దేవాదాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్నా..ఇటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందని ప్రశ్నిస్తున్నారు. కేవలం..సమాచార లోపం కారణంగానే పొరపాటు జరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం అటు ప్రభుత్వంలో ఇటు టీటీడీటో ఉత్కంఠకు కారణమైంది.












Click it and Unblock the Notifications