coronavirus: తిరుమలలో కరోనా కలకలం..? భక్తుడికి పాజిటివ్ లక్షణాలు, రుయా ఆస్పత్రిలో చేరిక..
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఓ భక్తుడికి జలుబు, తీవ్ర జ్వరం ఉండటంతో కరోనా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. అశ్విని ఆస్పత్రిలో ప్రాథమిక చేసిన అనంతరం.. తర్వాత రుయా ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో భక్తుడు దామోదరానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని నుంచి కరోనా వైరస్ శాంపిల్ సేకరించారు. నివేదిక వచ్చాక.. సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తామని వైద్యులు పేర్కొన్నారు.
దైవ దర్శనం కోసం..
మహారాష్ట్రకు చెందిన దామోదరం.. వంద మందితో కలిసి దైవ దర్శనాలకు వెళ్లారు. ఇటీవలే వారణాసిలో దర్శనం తర్వాత వారి బృందం తిరుమలకు చేరుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో జలుబు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే తిరుమలలో అతను కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అశ్వని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు రుయాకు తరలించారు. అతని నుంచి కరోనా టెస్టులకు సంబంధించి రక్త నమూనాలను సేకరించారు. రిపోర్ట్ వచ్చేవరకు అతనితోపాటు వచ్చిన వంద మందిని తిరుపతిలోని మానవ నిలయంలో ఉంచారు. నెగిటివ్ వస్తే ఓకే.. పాజిటివ్ వస్తే మాత్రం, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
50 వేల మంది భక్తుల రాక..
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం 50 వేల మంది భక్తులు వస్తుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తరిస్తారు. ఈ క్రమంలో ఓ భక్తుడికి కరోనా వైరస్ సోకితే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. వేలాది మంది రావడం, వారు తమ తమ స్వస్థలాలకు చేరుకోవడంతో వైరస్ వ్యాపించే అవకాశం ఉంది అనే ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ వల్ల దేశంలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా.. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తిరుమలలో కూడా వైరస్ ప్రబలితే.. వేగంగా విస్తరిస్తోందనే ఆందోళన నెలకొంది
Recommended Video
షిరిడీ, చిలుకూరు ఆలయాలు క్లోజ్
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు షిరిడీ, చిలుకూరు, వైష్ణోదేవి ఆలయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. శ్రీకాళహస్తిలో చిన్నారులు, వృద్ధులను అనుమతించడం లేదు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల దేవస్థానం కూడా మూసివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా లక్షణాలతో ఓ భక్తుడు ఆస్పత్రిలో చేరడం కలకలం రేపింది.