సీమ జిల్లాల్లో ఆ 48 గంటలు..!!
తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాన్ బలహీనపడుతున్న కొద్దీ వర్షాలు తీవ్రతరమౌతోన్నాయి. తీరాన్ని తాకిన అనంతరం వాయుగుండంగా మారిందీ తుఫాన్. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అటు తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మరో 24 నుంచి 48 గంటల వరకు వర్షాలు పడొచ్చని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మహాబలిపురం వద్ద తీరం..
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండోస్ తుఫాన్.. అర్ధరాత్రి మహాబలిపురం వద్ద తీరం దాటిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పుడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలు చోట్ల మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది

తీర ప్రాంతం అల్లకల్లోలం..
అత్యధికంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 125.75 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా నాయుడిపేటలో 114 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్య కారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు.

వదలని వాన..
తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, రామనాథపురం, నాగర్ కోయిల్, నాగపట్టణం.. తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. చెన్నైలో తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. ముందు జాగ్రత్తచర్యగా పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. ఆయా జిల్లాల్లో పాఠశాలలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరో 24 గంటల పాటు తుఫాన్ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.

బెంగళూరులో ఏకధాటిగా..
కర్ణాటకలో బెంగళూరు సహా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. బెంగళూరు బండికొడిగేహళ్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 65 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండూరు-63.5, యలహంక-60.5, హొరమావు-58.8, రాజమహల్ గుట్టహళ్లి- 57, విద్యారణ్యపుర-51, దొడ్డజాల-51, యశ్వంతపుర-50, చిక్కజాల-48.5, కృష్ణరాజపురం-46.5, బెట్టహలసూర్-44, నాగేహళ్లి-43.5 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది.

తిరుపతిపై పెను ప్రభావం..
కాగా- భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. గత ఏడాది కూడా ఇదే డిసెంబర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల ప్రభావంతో తిరుపతిలో అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో కూడా మళ్లీ అదే పరిస్థితి అక్కడ తలెత్తింది. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు చలి తోడు కావడంతో- ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications