ఆసక్తికరంగా తిరుపతి ఉప ఎన్నిక - బీజేపీ నుంచి పనబాక ? టీడీపీ తరఫున శివప్రసాద్ కుటుంబం ?
తిరుపతిలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన లోక్సభ స్ధానానికి జనవరి తర్వాత ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించే అవకాశముంది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్ధులపై దృష్టిసారిస్తున్నాయి. అయితే ఏ ప్రధాన పార్టీకి కూడా ఇక్కడ బలమైన అభ్యర్ధి లేకపోవడం, ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో ఇక్కడ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో ఓడిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిపైనా ఇప్పుడు అందరి చూపూ నెలకొంది. ఆమెను పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే టీడీపీ తరఫున మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించే అవకాశముంది.

తిరుపతి ఉపఎన్నిక రాజకీయం
వైసీపీ ఎంపీ బల్లి దుర్గప్రసాద్ కరోనాతో మృతి చెందిన నేపథ్యంలో తిరుపతిలో ఆరునెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సీటును ఉప ఎన్నిక కోసం నోటిఫై చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపింది. మరోవైపు ఈ ఉప ఎన్నికను ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు కూడా తిరుపతి ఉప ఎన్నికలపై తెరవెనుక రాజకీయాలు మొదలుపెట్టేశాయి. దీంతో ఆయా పార్టీల తరఫున అభ్యర్ధులుగా రంగంలోకి దిగేందుకు పోటీ కూడా పెరుగుతోంది.

పనబాక బీజేపీ అభ్యర్ధి అవుతారా ?
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాలకు సైతం ఆమె హాజరు కాలేదు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఆమె అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. స్ధానికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఆమె టీడీపీకి గుడ్బై చెప్పి బీజేపీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాకపోయినా ఆ దిశగానే పనబాక అడుగులు ఉన్నట్లు సమాచారం. గతంలో తనతో పాటు కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి ఇప్పుడు బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. తాజాగా నడ్డా టీమ్లోనూ ఆమెకు చోటు దక్కింది. దీంతో పురంధేశ్వరి సాయంతోనే ఆమె బీజేపీలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే టీడీపీకి ఝలక్ తప్పకపోవచ్చు.

శివప్రసాద్ కుటుంబానికి టీడీపీ సీటు...
పనబాక బీజేపీలోకి వెళ్లిపోతే మాత్రం టీడీపీ తరఫున ప్రత్యామ్నాయ అభ్యర్ధి ఎవరు అవుతారనే ఆసక్తి కూడా నెలకొంది. అయితే పనబాక ఎలాగో గతేడాది ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో ఆమె స్ధానంలో ప్రత్యామ్నాయ అభ్యర్ధులపై టీడీపీ దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు మాజీ ఎంపీ, చంద్రబాబు సన్నిహితుడు దివంగత శివప్రసాద్ కుటుంబం నుంచి ఆయన అల్లుడు నరసింహ ప్రసాద్ లేదా మరొకరికి తిరుపతి నుంచి సీటిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పనబాకపై స్పష్టత వస్తే శివప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి సీనియర్ నేత వర్లరామయ్య కూడా తిరుపతి నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పనబాక కాదంటే ఆయన కూడా రేసులో ఉంటారని చెబుతున్నారు.
Recommended Video

వైసీపీ వ్యూహాత్మక మౌనం...
గతంలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులు చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఉప ఎన్నికల్లో నిలబెట్టి అన్ని పార్టీలు మద్దతివ్వాలనే సిద్ధాంతాన్నితెరపైకి తెచ్చిన వైసీపీ.. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి స్ధానంలో ఆయన కుటుంబానికి చెందిన బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో నిలబెడితే పోటీ అభ్యర్ధిని నిలబెట్టింది. ఇప్పుడు అదే సూత్రాన్ని విపక్షాలు కూడా తెరపైకి తీసుకొచ్చి పోటీకి దిగితే ఏం చేయాలనే దానిపై వైసీపీలో మథనం కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారాన్ని చివరి వరకూ నాన్చడం ద్వారా ప్రత్యర్ధులకు ఇక్కడ అవకాశం లేకుండా చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో దివంగత బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను కానీ మరొకరిని గానీ బరిలోకి దింపడం ద్వారా సిట్టింగ్ స్ధానం విపక్షాలకు పోకుండా చూసుకోవాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు వైసీపీ నేతలు తిరుపతి ఉప ఎన్నికపై బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.












Click it and Unblock the Notifications