శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ షాక్: ఆ దర్శనం టోకెన్ల జారీ క్యాన్సిల్?: ఎప్పటి నుంచి
తిరుపతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. మొన్నటిదాకా వేలకు మాత్రమే పరిమితమైన కరోనా కేసులు.. ఇక లక్షల్లో రికార్డవుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో మూడుసార్లు లక్షకు పైగా కొత్త కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. శుక్రవారం నాటి బులెటిన్ ప్రకారం.. 1,31,968 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది ఇప్పటిదాకా ఉన్న ఆల్టైమ్ రికార్డ్. రోజు దాటితే ఈ రికార్డ్ బద్దలు కాదనే గ్యారంటీ ఉండట్లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్యను నియంత్రించేలా చర్యలను చేపట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా- శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయడాన్ని నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు. సోమవారం సర్వదర్శనం టోకెన్లను జారీ చేయట్లేదని అంటున్నారు.
ఆదివారం సాయంత్రం వరకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లను జారీ చేశారని, ఆ మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్లను జారీ చేయడాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఉచిత దర్శనం టోకెన్ల జారీ ఉండదని అంటున్నారు. సర్వదర్శనం టోకెన్లను జారీ చేయడానికి టీటీడీ అధికారులు భూదేవి, విష్ణు నివాసం కాంప్లెక్స్లల్లో ప్రత్యేకంగా కౌంటర్లను నెలకొల్పిన విషయం తెలిసిందే. వాటి కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది.
ఈ పరిస్థితులు కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం కాగలవని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. టోకెన్లను తీసుకున్న భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలోనూ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చని, అందుకే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వాటిని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ టోకెన్ల జారీ ఉండబోదని అంటున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇది తప్పట్లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Recommended Video
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గురువారం జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 465 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 92,205కు చేరుకోగా.. ఇందులో డిశ్చార్జ్ అయిన వారు 88,792 మంది ఉన్ారు. 2,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 878 మంది మృత్యువాత పడ్డారు. అన్ని జిల్లాల కంటే అత్యధిక మరణాలు నమోదైనవి ఈ జిల్లాలోనే.