శ్రీవారి భక్తులకు శుభవార్త: రేపట్నుంచి సర్వ దర్శనం టికెట్లు జారీ, ఆ జిల్లా వాసులకే
తిరుపతి: శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది తిరుమల తిరుపతి దేవస్తానం(టీటీడీ). బుధవారం(సెప్టెంబర్ 8) నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. బుధవారం నుంచి అలిపిరి వద్ద రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపత దేవస్థానం.
అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టోకెన్లు జారీని పరిమితం చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.

ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుంచి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అయితే, కరోనా విజృంభణ సమయంలో.. పూర్తిగా దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. ఆ తర్వాత క్రమంగా భక్తులకు కూడా అనుమతి ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీ రామనామ స్మరణతో పులకించిన వసంత మండపం
లోక సంక్షేమం కోసం, కరోనా మూడవ వేవ్ నుండి చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల వసంతమండపంలో సెప్టెంబరు 3వ తేదీ నుండి టిటిడి నిర్వహిస్తున్న" షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష " కార్యక్రమంలో భాగంగా 5వ రోజైన మంగళవారం శ్రీరామ జనన సర్గల పారాయణం జరిగింది.
బాలకాండలో " బభౌరామఃసంప్రహృష్టఃసర్వదైవతైః " అనే 16 అక్షరాల వాక్యం విశిష్టమైనది. ఇందులో 5వ రోజు " సం " అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం బాలకాండలోని 15వ సర్గ నుండి 21వ సర్గ వరకు ఉన్న 230 శ్లోకాలను పారాయణం చేశారు. ఇందులో భాగంగా మొదట సంకల్పంతో ప్రారంభించి శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆ తరువాత 16 మంది ఉపాసకులు శ్లోక పారాయణం చేశారు. కాగా బాలకాండలోని మొత్తం 77 సర్గల్లో 2,232 శ్లోకాలు ఉన్నాయి.
ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని పర్యవేక్షణలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు శ్రీ రామకృష్ణ సోమయాజి శర్మ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కాగా, శ్రీరామ జనన సర్గల పారాయణం సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊయ్యలలో బాల శ్రీ రామచంద్రమూర్తి, ఇరువైపుల శ్రీ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ మహావిష్ణువులను ఏర్పాటు చేశారు.
రామ జనన కీర్తనతో పులకించిన వసంత మండపం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామివారు రచించిన శ్రీరామ జనన కీర్తనను తిరుపతికి చెందిన ప్రముఖ గాయని డా.ఆముక్తమల్యాద సుషణ బృందం " రామ శ్రీ రామ లాలి ఊగుచు ఘన శ్యామా నేను బ్రోవు లాలి ........" కీర్తనను సుమధురంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, వేద పండితులు పాల్గొన్నారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో :
ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థనా మందిరంలో జిఎవి దీక్షితులు ఆధ్వర్యంలో బాలకాండ పారాయణంలో భాగంగా ప్రతి రోజు కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు విశేష మంత్రాలతో జప-తర్పణ-హోమాదులు నిర్వహిస్తున్నారు. లోక క్షేమం కోసం 16 రోజుల పాటు ఉపాసకులు అకుంఠిత దీక్ష, శ్రద్ధలతో శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం జపిస్తున్నారు. జపంలో పదవ వంతు ఆవు పాలతో తర్పణం, తర్పణంలో 10వ వంతు హోమాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీ రామచంద్రమూర్తికి స్నపన తిరుమంజనం, చతుష్టార్చన, శాత్తుమొర, పూజ జపం, హోమం నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంగపూజ నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications