Tirumala: తిరుమలలో ఈదురుగాలులతో వడగండ్ల వర్షం..
కలియుగ వైకుంఠం తిరుమల(Tirumala)లో భారీ వడగండ్ల వర్షం పడింది. ఉదయం నుంచి మండే ఎండలతో భక్తులు ఇబ్బింది. పడ్డారు. మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు వచ్చి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల వర్షంతో భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు. వడగండ్లు పడడంతో భక్తులు షెడ్ల కిందికి పరుగులు తీశారు. వర్షంతో షాపింగ్ కాంప్లెక్స్, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. మరోవైపు ఈ వర్షానికి ఘాట్ రోడ్ లో అక్కడక్కడ కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోందని చెబుతున్నారు. గురువారం 56,680 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 18,947 మంది భక్తులు, తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ తెలిపింది. వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.
తిరుమలలో ఓ ఎమ్మెల్సీ తన సిఫార్సు లేఖల ద్వారా భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి దర్శనం చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తిరుమలలో 16 మంది ప్రజా ప్రతినిధులు ఎక్కువగా సిఫార్సు లేఖలను ఇస్తున్నట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది. గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్సీ తన సిఫార్సు లేఖలతో ఇతర రాష్ట్రాల భక్తులకు లేఖలు ఇచ్చి విజిలెన్స్ సోదాల్లో దొరికిపోయారు. ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తలను తనతో పాటుగా దర్శనానికి తీసుకెళ్తున్నట్లుగా అధికారులు తేల్చారు.