ప్రేమించినోడు అనుమానించాడు.. తట్టుకోలేక వివాహిత బలవన్మరణం.. పిల్లలు కూడా
భర్తే సర్వస్వం అనుకుంది. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ కూడా లేదు. కులం వేరైనా.. ప్రేమించడంతో నమ్మింది. పిల్లలు పుట్టే వరకు కూడా ఓకే.. తర్వాత అనుమానం పెరిగి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. తిరుపతి స్విమ్స్లో నర్స్ గా పనిచేసే నీరజ చిన్నతనంలో తల్లి తండ్రులను కోల్పోయింది. మేనమామ చేరదీసి ఇంటర్ వరకు చదివించాడు. నర్స్ ట్రైనింగ్ పూర్తి చేయించి స్విమ్స్ లో ఉద్యోగం ఇప్పించాడు. తిరుపతి ఎలక్రిసిటీ డిపార్ట్ మెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేసే కిశోర్ తో పరిచయం ఏర్పడింది. చిత్తూరు జిల్లాలోని గుడాణ్యంపల్లెలో కిశోర్ తల్లి తండ్రులు నివసిస్తున్నారు. ఇద్దరి కులాలు వేరైనా ఇంట్లో తల్లితండ్రులను ఒప్పించి కిశోర్ నీరజను తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
ఇద్దరు పిల్లలు
ఆ దంపతులకు చందు, చైత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఏర్పడిన లాక్ డౌన్ సమయంలో తిరుపతి వదిలి పెట్టి గుడాణ్యంపల్లెకి వచ్చి తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. తిరుపతి ఎలక్ట్రిసీటీ డిపార్ట్ మెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని వదిలేసి పెనుమూరు మండలంలో కోళ్ళ ఫారాలు లీజుకు తీసుకుని వ్యాపారం ప్రారంభించాడు.
అనుమానం..
నీరజ రోజు గుడాణ్యంపల్లె నుంచి తిరుపతి స్విమ్స్ కు డ్యూటీకి వచ్చి వెళ్లేది. కిశోర్ ఎప్పుడూ ఫోన్ చేసిన నీరజ ఫోన్ ఎంగేజ్ వచ్చేది. దీంతో అతనికి భార్యపై అనుమానం రావడమే కాదు మరింత బలపడింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో చివరికి ఆమెను ఉద్యోగం మాన్పించేశాడు. నీరజ ఇంట్లో ఒంటరిగా ఉండలేక పోయింది. తిరుపతి వెళ్లి పోదామని భర్తను కోరింది. దీనికి భర్తతో పాటు ఇంట్లోఅత్తమామలు కూడా వ్యతిరేకించారు.
చేయి చేసుకోవడంతో
ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గత శనివారం రాత్రి నీరజ భర్త, అత్తమామలతో గొడవ పడింది. వారు నీరజపై చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నీరజ ఆదివారం తెల్లవారుఝూమున తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని స్కూటీపై అత్తింటినుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించటం లేదని భర్త కిశోర్ ఆదివారం పెనుమూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం రామచంద్రాపురం మండలానికి చెందిన కొందరు ఉపాధి కూలీలు ఓ క్వారీ గుంతలో 3 మృతదేహాలను కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Recommended Video
ముగ్గురి మృతి
నీరజతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలు గుర్తించారు. రామాపురం చెత్త సేకరణ కేంద్రం వద్ద స్కూటీ పార్క్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో ఆమె కిశోర్ భార్య నీరజగా గుర్తించారు. ఆదివారమే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రామచంద్రాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.