దొడ్లో ఎద్దు.. నిమ్మగడ్డ ఒక్కటే..? ఎస్ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు
ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ విరుచుకుపడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు- నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తోడు దొంగలు అని పెద్దిరెడ్డి ఫైరయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని పెద్దిరెడ్డి అడిగారు. టీడీపీ- చంద్రబాబు నాయుడుపై ఎందుకు కనీసం కామెంట్ చేయడం లేదని అని నిమ్మగడ్డను ప్రశ్నించారు.
దొడ్లో ఎద్దులు..
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలదీశారు. ఈ అంశంపై నిమ్మగడ్డకు ఫిర్యాదుచేసినా.. మా దొడ్లో ఎడ్లకు ఫిర్యాదు చేసినా రెండూ ఒకటే అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశమయ్యారు.
మేనిఫెస్టో ఏంటీ..?
పార్టీలకతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై పల్లె ప్రగతి- పంచసూత్రాలు పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను ఏ విధంగా విడుదల చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తనను ఉన్మాది అనడానికి చంద్రబాబుకు ఏ అర్హత ఉందని అడిగారు. తనకు మంత్రి పదవి ఇచ్చారా.. అని కొశ్చన్ చేశారు. తనపై కామెంట్ చేసిన నిమ్మగడ్డే ఉన్మాది అని మండిపడ్డారు.
మాటల యుద్ధం..
ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. అప్పటినుంచి వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ సిద్దమయ్యారు. కానీ నేతల మధ్య మాటలయుద్ధం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.