‘ఘోరాలు జరిగితే కులాలు అంటగడతారా? మంత్రులే పచ్చిబూతులు మాట్లాడితే..’
తిరుపతి: మాతృ భాషను చంపేస్తుంటే ఊరుకోవాలా? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం తిరుపతిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంగ్లం వద్దని తాము అనడం లేదని, తెలుగును కాపాడాలంటున్నామని చెప్పారు.

మిగితా కులాలు, మతాలు అలా కాదా..
తాను ఒక్కడినే అన్ని సమస్యలపై ఎన్ని కోట్ల మంది వద్దకు వెళ్లాలని అన్నారు. అందరూ కలిసి వస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. జగన్ రెడ్డి మాట్లాడుతూ.. నా మతం మానవత్వం.. నా కులం మాట తప్పని కులం అంటున్నారని.. అంటే మిగితా కులాలు మాట తప్పుతాయా? మిగితా మతాలకు మానవత్వం లేదా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు .

మంత్రులే పచ్చిబూతులు తిడితే..
150మంది ఎమ్మెల్యేలకు మాట్లాడే విధానం కూడా తెలియదని అన్నారు పవన్ కళ్యాణ్. రాజ్యాంగం చదివితే వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. అమ్మా.. అలీ అని అసహ్యమైన భాషతో మంత్రులే పచ్చిబూతులు మాట్లాడుతుంటే.. రోడ్డున వెళ్లే దుర్మార్గులకు మానభంగం చేయాలనే ఆలోచన రాదా? అని ప్రశ్నించారు. చట్టాలను మాట్లాడవారే పిచ్చికూతలు కూస్తే.. వారిని చూసి చెలరేగిపోరా? అంటూ మండిపడ్డారు. తెలంగాణలో నలుగురు దుర్మార్గులు దిశ అనే అమ్మాయిపై అత్యాచారం చేసి హత్య చేశారని అన్నారు. మంత్రుల స్థానంలో ఉండే వారే బాధ్యతలేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

ఘోరాలు జరిగితే కులం అంటగడతారా?
తాను సమాజం బాగు కోసం వచ్చానని.. ఓటమి గెలుపు ఓటములతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్లకు ఏం పదవులున్నాయని.. అంబేద్కర్ కూడా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారని గుర్తు చేశారు. మార్పు కోసం కంకణం కట్టుకున్నామని తెలిపారు. న్యాయవాదులు త్రికరణ శుద్ధితో రాజకీయాల్లోకి రావాలని అన్నారు. పొలిటికల్ గేమ్ ఆడితే మార్పు రాదని అన్నారు. మానవ హక్కులు గురించే మాట్లాడితే.. దిశ అమ్మాయి ఘటన విషయంలో కులం చూస్తామా? అని ప్రశ్నించారు. అగ్రకులమంటారా? బీసీ, దళిత అని చూస్తామా? అని మండిపడ్డారు. ఘోరాలు జరిగితే కులాల గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. దళితులంటే మిగితా కులాలకు సంబంధం ఉండదా? అని అన్నారు. మానవ హక్కులంటే కొద్ది మందికే కాదు.. అందరికీ ఉండాలన్నారు.

జగన్.. చెట్లను నరికించడమే మీ మానవత్వమా?
తాను జగన్ రెడ్డి గారూ అనే అంటానని.. సీఎంగా గుర్తించనని పవన్ కళ్యాణ్ చెప్పారు.
జగన్ తన మతం మానవత్వం అంటున్నారని.. రైల్వే కోడూరులో మాటలు కూడా మాట్లాడని బత్తాయి చెట్లను నరికించేశారు.. ఇదేనా మీ మతం అంటూ పవన్ నిలదీశారు. రాయలసీమ అనగానే వేటకొడవళ్లు, బాంబులు గుర్తువచ్చేలా చేశారని అన్నారు. ఇక్కడ చదువుకున్న సరస్వతులు కూడా ఉన్నారని ఎవరికీ తెలియదన్నారు. అది ఇక్కడి యువతే చాటి చెప్పాలన్నారు. సీమను తెలంగాణవారు వద్దన్నారన్నారు. ఈ చెడ్డ పేరు ఎవరు తీసుకొచ్చారంటే ఇక్కడి కొంతమంది నేతలేనని అన్నారు.

ఆరు నెలల పాలనలో ఏం చేశారని..
ఇక్కడి యువతంతా రాయలసీమ సింహాలుగా తయారవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చదువుల సీమగా తయారు కావాలన్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్నా పవన్ కళ్యాణ్ ఈ సర్కారుకు సమాధానం చెబుతున్నారని అన్నారు. ఆరు నెలల పాలనలో ఏం సాధించారని గుద్దెసుకుంటున్నారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. న్యాయవాదులకు స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. న్యాయమూర్తులు కూడా జీతాలు కావాలని అడిగే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చన్నారు. సీమలో హైకోర్టు బెంచ్ కావాలని కొందరు కోరుతున్నారని.. తనకు హైకోర్టు బెంచ్.. సర్క్యూట్ బెంచ్కి తేడా తెలియదని.. తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయత భావం పెరిగిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications