తిరుమలలో ప్రహ్లాద్ మోడీ: సీఏఏ, ఎన్ఆర్సీలపై కీలక వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్లో శ్రీవారి ఆలయం..
తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వాములవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయనకు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించారు.

దేశ ప్రజలంతా బాగుండాలి..
శ్రీవారి దర్శనం అనంతరం ఆయలం వెలుపల ప్రహ్లాద్ మోడీ మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చానని తెలిపారు. దేశ ప్రజలందరూ బాగుండాలని, ఉన్నతంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశంపైనా ఆయన స్పందించారు.

సీఏఏ, ఎన్ఆర్సీపై కీలక వ్యాఖ్యలు..
సీఏఏ, ఎన్ఆర్సీలపై ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. సీఏఏపై అవగాహన లేని కొందరు నేతలు ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలకు, ప్రపంచానికి వారు తప్పుడు సంకేతాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ముస్లిం సోదరులు నమ్మొద్దని, వారి మాయలోపడి ఆందోళనలకు చేయొద్దని పిలుపునిచ్చారు ప్రహ్లాద్ మోడీ. చట్టాలపై అవగాహన లేకుండా దేశ ప్రజలను తప్పుదోపట్టిస్తున్న కొంతమందికి శ్రీవేంకటేశ్వరస్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ప్రహ్లాద్ మోడీ చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగిపోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.

జమ్మూకాశ్మీర్లో శ్రీవారి ఆలయం..
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుతో అక్కడ శాంతియువత వాతావరణం ఏర్పడిందని.. త్వరలోనే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ అక్కడ నిర్మించుకోవచ్చని ప్రహ్లాద్ మోడీ ఆకాంక్షించారు. కాగా, జమ్మూకాశ్మీర్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications