రూ.లక్ష మూలధనం.. కానీ రూ.300 కోట్ల ఆస్పత్రి అంటూ గారడీ.. ఇదీ ఉద్వేగ్ బాగోతం
తిరుపతిలో అత్యాధునిక వసతులతో పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి 300 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. ఈ ప్రకటన భక్తులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. టీటీడీ తలపెట్టిన పిల్లల ఆస్పత్రిని 300 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఎంవోయూ కుదుర్చుకున్న ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మూలధనం కేవలం లక్ష రూపాయలేననే కఠోర నిజం తెలిసింది.

ఇక్కడే వీరి ఆఫీసులు
ముంబైలోని హీరానందిని ఎస్టేట్ రోడ్లో ఉన్న ఈ సంస్థ డైరెక్టర్లు సంజయ్ కేదార్నాథ్ సింగ్, వందనా సింగ్కు చెరి ఐదువేల చొప్పున పదివేల షేర్లు ఉన్నాయి. ఒక్కో షేరు పదిరూపాయల చొప్పున ఇద్దరికీ కలిపి ఉన్న షేర్ల విలువ కేవలం లక్షరూపాయలే. ఉద్వేగ్ సంస్థకు ఇప్పటివరకు వచ్చిన నష్టాలను మినహాయిస్తే, ఆ సంస్థ నికర విలువ 2020 మార్చి నాటికి అక్షరాలా 26 వేల 634 రూపాయలు. దేశవ్యాప్తంగా ఐటీ పార్కులు, సెజ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, హైక్లాస్ విల్లాలు.. ఒక్కటేమిటి రియల్ ఎస్టేట్లో దుమ్ముదులిపేస్తున్నామని టీటీడీ ముందు కలరింగ్ ఇచ్చుకున్నారు ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ సంజయ్ కేదార్నాథ్ సింగ్. అంత సీన్ ఉందా అంటూ వెబ్సైట్లో చూస్తే.. అన్నీ కంప్యూటర్లో తీర్చిదిద్దిన గ్రాఫిక్సే తప్ప.. ఒక్కటి కూడా రియల్ ఫోటో కనిపించలేదు. ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా వివరాలేవీ లేవు. ఒకరకంగా చెప్పాలంటే అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే.

49 వేల 900 రూపాయలు
ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లను తీసి చూస్తే.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన రెవెన్యూ కేవలం 49 వేల 900 రూపాయలు మాత్రమే. ఇదే సమయంలో సంస్థ నిర్వహణకు పెట్టిన ఖర్చు లక్షా 25 వేల రూపాయలు. ఈ లెక్కన ఆ కంపెనీకి వచ్చిన నష్టం 75 వేల రూపాయలు. ఆడిట్ రిపోర్ట్ కూడా దీన్ని కన్ఫామ్ చేసింది. ఇలా లక్ష రూపాయల మూలధనం, లక్ష లోపు ఆదాయం, కేవలం 26 వేల 634 రూపాయల నికర విలువ ఉన్న ఓ కంపెనీ.. ఏకంగా తిరుపతిలో 300 కోట్ల రూపాయల విరాళంతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టేందుకు ఎలా ముందుకు వచ్చింది..? నిజంగా ఆ సంస్థకే ఇంత భారీ స్థాయిలో విరాళం ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చూడలేదా... ఎలా నమ్మింది
ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ డైరెక్టర్ సంజయ్ కేదార్నాథ్ సింగ్తో రూ. 300కోట్ల విరాళంతో పిల్లల ఆస్పత్రి నిర్మించేందుకు శుక్రవారం ఎంవోయూ కూడా కుదుర్చుకున్న టీటీడీ.. ఇందుకు సంబంధించి కనీస కసరత్తు చేసి సాధ్యాసాధ్యాలను పరీశిలించిందా అనే అనుమానం వస్తోంది. పైగా ఆస్పత్రి నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చేందుకు టీటీడీ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కేరళను ఆదర్శంగా తీసుకొని
కేరళలోని చోటానిక్కర భగవతి దేవస్థానానికి 500 కోట్ల రూపాయల విరాళం ఇచ్చేందుకు కొచ్చిన్లోని దేవేశ్వర బోర్డును బెంగళూరుకు చెందిన గణశ్రావణ్ అనే భక్తుడు 2020 నవంబర్లో సంప్రదించాడు. ఇంత భారీ మొత్తంలో విరాళం స్వీకరించే విషయంలో తర్జన భర్జన పడిన ఆ దేవస్థానం బోర్డు.. కాస్త ముందూ వెనుకా ఆలోచించి.. ఈ డబ్బు ఎలా వచ్చిందో ఆధారాలు చూపాలంటూ ఆ భక్తుడిని కోరింది. భారీ మొత్తం కావడంతో ఎందుకైనా మంచిదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లింది. మరో అడుగు ముందుకు వేసి... కేరళ హైకోర్టుకు కూడా విషయాన్ని నివేదించాలని ఆ దేవస్థానం బోర్డు అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications