తిరుమలలో వసంతోత్సవాలు - మూడు రోజులు సేవలు రద్దు..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మూడు రోజులు స్వామి,అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ప్రతీ రోజు ఆస్థానం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ ఉత్సవాల వేళ సేవలను రద్దు చేసారు. ఇక, టీటీడీ ప్రారంభించిన దివ్య దర్శన టోకెన్లను అనూహ్య స్పందన కనిపిస్తోంది.
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమలలో ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజు ఏప్రిల్ 4న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

ప్రతీ రోజు స్నపన తిరుమంజనం
చివరిరోజు ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.
కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
దివ్య దర్శనం టోకెన్ల జారీ
వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 4న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఇక, టీటీడీ నడక దారి భక్తులకు ప్రారంభించిన దివ్య దర్శనం టోకెన్లకు అనూహ్య స్పందన కనిపిస్తోంది.
అలిపిరి నడక మార్గంలోని గాలి గోపురం వద్దర 10వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 5వేల టోకెన్లు ఇచ్చారు. ఉదయం 9.30 గంటలకే కోటా పూర్తి కావటంతో, ఆదివారం ఇవ్వాల్సిన దాదాపు మూడు వేల టోకెన్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం మిగిలినివి జారీ చేసి..సోమవారం నుంచి తిరిగి టోకెన్ల జారీ ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications