జగన్కు దేవుడితో పోలికా ? రమణదీక్షితులపై చంద్రబాబు ఫైర్- శ్రీవారి దర్శనం
ఏపీలో తిరుపతి ఉపఎన్నిక వ్యవహారం కాక రేపుతోంది. ప్రధాన పార్టీల నేతలంతా తిరుపతికి చేరుకుంటున్నారు. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. దర్శనం అనంతరం ఉపఎన్నిక ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల దర్శనం తర్వాత చంద్రబాబు సీఎం జగన్కు అనుకూలంగా ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఇవాళ్టి నుంచి బరిలోకి దిగుతున్న చంద్రబాబు.. ఉదయం తిరుమల చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. తిరుమలలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. తిరుమలలో పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని చంద్రబాబు తెలిపారు. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు.
తిరుమల ఆలయంలో ప్రధాన అర్చకులుగా తిరిగి బాధ్యతలు చేపట్టిన రమణ దీక్షితులపై చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. దేవుడు దేవుడే.. మనిషి మనిషే. మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడన్నారు.
మనుషులను దేవుడితో పోల్చడం తప్పని చంద్రబాబు అన్నారు. తాజాగా రమణదీక్షితులు తన పునర్ నియామకం చేసిన జగన్ను దేవుడితో పోల్చారు. దీన్ని చంద్రబాబు తప్పుబట్టారు. తిరుమలలో గతంలోనూ చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయన్నారు. పింక్ డైమండ్ మాయం అయిందని ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్లీ అదే పదవిలో నియమించడం మంచి సాంప్రదాయం కాదన్నారు.