తిరుపతిలో టీడీపీ నేత భరత్ యాదవ్ దారుణ హత్య.. కత్తులతో దాడి చేసి మరీ ఘాతుకం
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో టిడిపి కార్యకర్త భరత్ యాదవ్ పై దుండగులు దాడి చేసి హతమార్చారు. నిన్న రాత్రి కత్తులతో దాడి చేసిన దుండగులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్రగాయాల పాలైన భరత్ యాదవ్ రుయా ఆసుపత్రి లో చేర్పించినా ,తీవ్ర గాయాలు కావటంతో చికిత్స పొందుతూ మరణించారు. భరత్ యాదవ్ హత్యపై తిరుపతి తూర్పు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక వైసీపీ నేతలు ఉన్నారని , వైసిపి కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి .
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ బంధువైన భరత్ యాదవ్ ను గుర్తు తెలియని ఆగంతకులు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటనతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త భరత్ యాదవ్ హత్యపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భరత్ యాదవ్ హత్యను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, భరత్ యాదవ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు తిరుపతిలో ఐదు హత్యలు జరిగాయని పేర్కొంటూ చంద్రబాబు, తిరుపతిని రాజకీయ కక్ష సాధింపు వేదికగా మార్చారని వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భరత్ యాదవ్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి లో శాంతి భద్రతలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. భరత్ యాదవ్ హత్య శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్న చంద్రబాబు, ప్రశాంతంగా ఉండే తిరుపతిలో ఫ్యాక్షన్ రాజకీయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications