తిరుమలలో పెను మార్పులు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తుతోంది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ భారీగా ఉంటోంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.
సోమవారం నాడు 75,872 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 37,236 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.64 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఫలితంగా క్యూలైన్లో భక్తులు వేచివుంటోన్నారు. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పట్టిందంటే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యూలైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
కాగా- టీటీడీ కొత్త కార్యనిర్వాహణాధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి జే శ్యామలరావు తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇదివరకే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. అక్కడే అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
తాజాగా భక్తుల సౌకర్యం కోసం మరిన్ని నిర్ణయాలను తీసుకున్నారాయన. వేసవి కాలంలో భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమలలో పలు ప్రాంతాల్లో రోడ్లపై వైట్ కూలెంట్ పెయింట్ వేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు. తక్షణమే వాటిని అమలు చేసేలా చర్యలు చేపట్టారు.

సాక్షాత్ శ్రీమహావిష్ణువు కొలువు ఉండే తిరుమలలో భక్తులు చెప్పులు లేకుండా తిరుగుతారనే విషయం తెలిసిందే. వేసవిలో కాళ్లు కాలకుండా ఉండటానికి వైట్ కూలెంట్ పెయింట్ ఉపయోగపడుతుంది. ఇదివరకు శ్రీవారి ఆలయం పరిసరాల్లో రెడ్ కార్పెట్, పరిమితంగా రోడ్లపై వైట్ కూలెంట్ పెయింట్ ఉండేది.
ఇప్పుడు దాన్ని మరింత విస్తృతం చేశారు. శ్రీవారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం, వాహన మండపం, రామ్ బగీచల్లో రోడ్లపై ఈ వైట్ కూలెంట్ పెయింట్ వేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నాలుగు మాడ వీధుల్లో వైట్ కూల్ పెయింట్ వేశారు. వేసవిలో చలువ పందిళ్లను క్రమం తప్పకుండా వేయాలనీ నిర్ణయించారు.












Click it and Unblock the Notifications