శ్రీవారి ఆలయం మీదుగా హెలికాప్టర్లు - ఆగమశాస్త్ర నిబంధనలకు భిన్నంగా..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో గగన తలంపై మూడు హెలికాప్టర్లు ప్రయాణంచాయి. శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకూడదనేది ఆగమశాస్త్ర నిబంధన. అయినా తిరుమల మీదుగా ఇవి తిరగటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం హెలికాప్టర్ల గురించిన వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే, హెలికాప్టర్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందినవిగా భావిస్తున్నారు. కడప నుంచి చెన్నైకి హెలికాప్టర్లు తిరుమల మీదుగా వెళ్లినట్లు సమాచారం.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మంగళవారం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. తిరుమల నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు ఆలయం పరిసరాల మీదుగా హెలికాప్టర్లు ఎగరడం కలకలం సృష్టించింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలాజీనగర్ ఉపరితలంపై నుంచి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్లు సమాచారం. ఎన్నడూ లేనివిధంగా తిరుమల కొండపై హెలికాప్లర్లు ఎగరడంపై భక్తులు విస్మయానికి గురయ్యారు. దీని పైన టీటీడీ అధికారులు ఆరా తీసారు. ఈ హెలికాప్టర్లు తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో వెళ్లటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.

కొద్ది నెలల కిందట తిరుమలలో డ్రోన్ సంచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే, ఒక సర్వే కోసం వచ్చిన సిబ్బంది డ్రోన్ వినయోగించినట్లు టీటీడీ విచారణలో తేలింది. ఈ హెలికాప్టర్లు తిరగటం పైన టీటీడీ అధికారులు రేణుగింటలోని విమానాశ్రయం అధికారులను సంప్రదించారు. ఆ హెలికాప్టర్లు భారత వాయుసేనకు చెందినవిగా సమాచారం ఇచ్చారు. కడప బేస్ క్యాంపు నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో ఇటుగా వచ్చినట్లు వివరించారు. తిరమల మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకుండా చూడాలని కేంద్రానికి గతంలోనే టీటీడీ కోరింది. అయితే, ఇప్పటికీ తిరుమల ను నో ఫ్లయింగ్ జోన్ గా అధికారికంగా కేంద్ర విమాన యాన శాఖ గుర్తించలేదు. ఆగమశాస్త్ర నిబందనకు వ్యతిరేకమని చెబుతున్న వేళ.. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటన వచ్చేలా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications