శ్రీవారికి కానుకల వర్షం.. రూ. 131 కోట్లు దాటిన హుండీ ఆదాయం
తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిపై ఆయన భక్తులు కాసుల వర్షం కురిపించారు. వరుసగా నవంబర్ నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 100 కోట్ల మార్క్ దాటింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భక్తులను ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతిస్తుండటంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.
లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో స్వామివారికి హుండీ కానుకలు భారీగా వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ కానుకలు రూ. 100 కోట్లకుపైగా వస్తున్నాయి. నవంబర్ నెలలో కూడా రూ. 131.56 కోట్లు హుండీ కానుకలు లభించాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
సామాన్య భక్తుల కోసమే బ్రేక్ దర్శన సమయం మార్పు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుంచి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
శ్రీవారి ఆలయం ఎదుట గురువారం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు ప్రారంభించామన్నారు. మొదటిరోజు ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు దాదాపు 8,000 మంది సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు వివరించారు.
ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేసి పరిశీలిస్తున్నామని ఒక నెల తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మార్పు వల్ల ఉదయం 2 నుంచి 3 గంటల సమయం లభిస్తుందని, దాదాపు 15,000 మంది సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించవచ్చని తెలిపారు. బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి ఉదయం తిరుమలకు రావచ్చని, తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.