ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత: టీటీడీ, భక్తులకు సూచన
తిరుపతి: సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని రెండు రోజులపాటు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు.
బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అనంతరం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
అదేవిధంగా నవంబరు 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొలగిపోయే వరకు వంట చేయరు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు.
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి, అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్లో వైభవంగా శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ప్రారంభం
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో స్వామివారికి రోజువారీ నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించే విధంగా హైదరాబాద్లో 5 రోజుల పాటు తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవతో కైంకర్యాలను పూర్తి చేయనున్నారు.