రికార్డు స్థాయిలో పెరిగిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం: లాక్డౌన్ తర్వాత తొలిసారి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు తరలి రావడంతో స్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. కరోనా లాక్డౌన్ తర్వాత ఇంత భారీ మొత్తంలో హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ. 4.3 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ నెలలో ఇప్పటికే ఐదుసార్లు హుండీ ఆదాయం రూ. 3 కోట్లకుపైగా వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారంనాడు వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమలలో భక్తులు పోటెత్తారు. లాక్డౌన్ తర్వాత ఈరోజు రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు మొత్తంగా శ్రీవారిని దర్శించుకున్నవారి సంఖ్య 40వేలు దాటిందని చెబుతున్నారు. కాగా, కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోవడంతో శ్రీవారి హుండీకి ఆదాయమే లేకుండా పోయింది. ఇక అన్లాక్ మొదలైన నాటి నుంచి క్రమంగా భక్తులను సంఖ్యను పెంచుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అదే విధంగా హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది.
టీటీడీకి రూ.2.54 కోట్ల విరాళం
వైకుంఠ ఏకాదశి నాడు శుక్రవారం టిటిడికి రూ.2.54 కోట్లు విరాళంగా అందాయి. టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు కుమారగురు తన సొంత ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రం ఊలందూరుపేటలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. అదేవిధంగా, హైదరాబాద్కు చెందిన ఇంద్రకుమార్ అనే భక్తుడు టిటిడి విద్యాదాన ట్రస్టుకు రూ.1.08 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు రూ.54 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు విరాళాల డిడిలను శ్రీవారి ఆలయంలో టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డికి అందజేశారు.
IMAGE CREDITS: TTD Photo
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టివ్ బోబ్డే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహాద్వారం ద్వారా ఆయన దర్శనం చేసుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో డా. కేఎస్ జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి, స్వాగతం పలికారు. చీఫ్ జస్టివ్ బోబ్డే వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.