జగన్ మతాన్ని పక్కన పెట్టినట్టే? సమస్యలపై ఫోకస్ పెట్టిన ఏపీ బీజేపీ: కేజీలెక్కన ఇసుక
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తోన్న క్రైస్తవ మతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని..ఇన్నాళ్లూ విమర్శలను గుప్పిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు.. ఇక రూటు మార్చినట్టే కనిపిస్తోంది. మతం ప్రాతిపదికన రాజకీయాలు చేయడం వర్కవుట్ కావట్లేదని భావిస్తోన్న బీజేపీ నాయకులు స్థానిక అంశాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో చోటు చేసుకుంటోన్న లోటుపాట్లను టార్గెట్గా చేసుకున్నట్టున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలే ప్రధాన అజెండాగా మార్చుకుంటున్నారు.
స్టూడెంట్స్కు జగన్ సర్కార్ గుడ్న్యూస్: ఒంటిపూట బడులు ఎప్పట్నుంచంటే: కొత్త టైమ్ టేబుల్ ఇదే
వైఎస్ జగన్ను యేసుబాబుగా గుర్తిస్తూ మొన్నటికి మొన్న సోము వీర్రాజు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ పూర్తిగా మత రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైసీపీ నేతలు భగ్గుమన్నారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు పునారోచలనలో పడినట్టు కనిపిస్తున్నారు. అందుకే ఈ సారి ఇసుక అంశాన్ని ఎత్తుకున్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న ఇసుక విధానం వల్ల వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, వైసీపీ నేతల అక్రమాలు, అవినీతికి ఇది కారణమౌతోందని ధ్వజమెత్తుతున్నారు.
ఇసుక రీచ్ల కేటాయింపులో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోన్నారు. ఇసుక తెల్లబంగారంగా మారిందంటూ భగ్గుమంటున్నారు. తిరుపతిలో ఇసుకను కేజీలెక్కన అమ్ముతూ నిరసన తెలిపారు.
అనంతరం ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. తక్కెడలో ఒక వైపు కేజీ ఇసుక, మరో వైపు నోట్ల కట్టలను ఉంచి వినూత్న ప్రచార శైలిని తెర మీదికి తీసుకొచ్చారు. ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇసుక తెల్లబంగారంగా మారిందని, వేల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోందంటూ ఆరోపణలను సంధిస్తున్నారు. తిరుపతిలో నిర్వహించిన ఈ నిరసనలో రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
జగన్ మతాన్ని పక్కన పెట్టినట్టే? సమస్యలపై ఫోకస్ పెట్టిన ఏపీ బీజేపీ: కేజీలెక్కన ఇసుక#BJP #AndhraPradesh #ysjagan pic.twitter.com/tUxIEjiLvj
— oneindiatelugu (@oneindiatelugu) March 23, 2021