తిరుపతి ఉపఎన్నిక: సొంత కారు లేని వైసీపీ అభ్యర్థి,ఆస్తులే లేని కాంగ్రెస్ అభ్యర్థి,అందరికన్నా రిచ్ ఆవిడే...
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వైసీపీ,బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం(మార్చి 29) నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం... వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి సొంత కారు కూడా లేకపోవడం గమనార్హం. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తన పేరిట అసలు ఆస్తిపాస్తులేమీ లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ ఇద్దరి కంటే బీజేపీ అభ్యర్థి రత్నప్రభకే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆస్తులు
గురుమూర్తి కుటుంబ ఆస్తులు మొత్తం రూ.47.25లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో గురుమూర్తి పేరిట రూ.10,66,515 విలువైన చరాస్తులు,భార్య నవ్యకిరణ్ పేరిట రూ.24,92,529 విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. తన భార్య పేరిట రూ.7లక్షల విలువైన కారు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఏర్పేడు మండలం మన్నసముద్రంలో రూ.5లక్షలు విలువచేసే రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. గురుమూర్తి డిపెండెంట్స్ కార్తికేయ నిక్షాల్ వద్ద రూ.2.92లక్షల విలువైన 62 గ్రామలు బంగారం,డెలీనా నిక్షాల్ వద్ద రూ.3.73లక్షల విలువైన 83 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ఆస్తులు
ఇప్పటివరకూ ఆరుసార్లు ఎంపీగా పనిచేసిన చింతా మోహన్ తన పేరిట ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. కుటుంబం పేరిట రూ.3.27కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.2లక్షలు నగదు,రూ.14,40,000 విలువైన 400 గ్రాముల బంగారం ఉందని తెలిపారు. వార్షికాదాయం రూ.6.10లక్షలుగా పేర్కొన్నారు.
తిరుపతిలో రూ.1.20కోట్లు విలువ చేసే 20 సెంట్ల వ్యవసాయేతర భూమి,రామచంద్రనగర్లో రూ.95లక్షలు విలువచేసే కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు చెప్పారు. ఎస్బీఐలో రూ.19.11లక్షల అప్పు ఉందని,ఎలాంటి కేసులు లేవని తెలిపారు.
బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఆస్తులు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభ తమ కుటుంబం పేరిట రూ.24,68,52,141 విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో రత్నప్రభ పేరిట రూ.19కోట్లు పైచిలుకు ఆస్తులు ఆమె భర్త పేరిట రూ.5కోట్లు పైచిలుకు ఆస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో రూ.2.81కోట్ల నగదు డిపాజిట్లు,బాండ్ల రూపంలో రూ.28వేలు,తపాలా పొదుపు ఖాతాలో రూ.4లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.52లక్షల విలువ చేసే 1250 గ్రాముల బంగారం,రూ.1.95లక్షల విలువైన 3కేజీల వెండి,రూ.16లక్షలు విలువ చేసే రెండెకరాల వ్యవసాయ భూమి,రూ.3కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నట్లు వెల్లడించారు.
ఎస్బీఐలో తన పేరిట రూ.243లక్షల రుణం,భర్త విద్యాసాగర్ పేరిట ఆంధ్రా బ్యాంకులో రూ.17.30లక్షల వ్యవసాయ రుణం ఉన్నట్లు వెల్లడించారు. తమపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు.
టీడీపీ అభ్యర్థి వనబాక లక్ష్మి ఆస్తులు
గతవారమే టీడీపీ తరుపున నామినేషన్ దాఖలు చేసిన వనబాక లక్ష్మి తన మొత్తం ఆస్తుల విలువ రూ.7.77 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించారు. బ్యాంకు ఖాతాల్లో నగదు, ఇతర ఆస్తుల విలువ రూ.2.05 కోట్లు, రూ.5.70 కోట్లు విలువ చేసే వ్యవసాయ భూమి, ఇతర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. తన భర్త పనబాక కృష్ణయ్య బ్యాంకు ఖాతాల్లో రూ.44.37 లక్షలున్నట్లు పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ తాటివర్రులో తన పేరిట ఐదున్నర ఎకరాలు, అదే జిల్లాలో 4.40 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని పేర్కొన్నారు. తన భర్త పేరిట కోట మండలం వెంకన్నపాలెంలో 2.34 ఎకరాలు, చిట్టేడులో 15.05 ఎకరాలు, కోటలో 6 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడలో 1212 చదరపు గజాల స్థలం, హైదరాబాద్లో రెండు ఫ్లాట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన భర్త పేరిట శంషాబాద్లో 400 చదరపు గజాలు స్థలం, కోట మండలం వెంకన్నపాలెంలో ఒక ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై ఎలాంటి పోలీస్ కేసులు లేవని తెలిపారు.