తిరుపతి ఎంపీ మృతి:మోదీ దిగ్భ్రాంతి -ఎవరూ సురక్షితంగా లేరన్న ఉత్తమ్ -బాధాకరమన్న చంద్రబాబు
వైసీపీ కీలక నేత, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన నాయకులని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని గుర్తుచేసిన ప్రధాని.. దివంగత నేత ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు.

కరోనా చికిత్సలో గుండెపోటు..
కరోనా బారినపడి, చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఎంపీ హఠాన్మరణం పట్ల సీఎం జగన్, వైసీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న దుర్గాప్రసాద్ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గూడూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తిరుపతి స్థానం నుంచి 2,28,376 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎంపీ మరణంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు సంతాపాలు తెలిపారు.

మనలో ఎవరూ సేఫ్ గా లేరు
‘‘లోక్ సభలో నా సహచరుడు, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణంగా మృతి చెందారన్న వార్త కలచివేస్తోంది. ఈ విషాద ఘడియల్లో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కఠోరమైన వాస్తవం ఏమిటంటే... కోరలు చాస్తున్న ఈ మహమ్మారి నుంచి మనలో ఏ ఒక్కరూ కూడా సురక్షితంగా లేరన్న విషయం ఈ ఘటనతో వెల్లడైంది'' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.

టీడీపీ కేబినెట్ మంత్రిగా..
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇక లేరన్న వార్త తెలిసి ఎంతో బాధ కలిగిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బల్లి దుర్గాప్రసాద్ గతంలో టీడీపీ తరఫున నాలుగు సార్లు గూడూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విద్యాశాఖ మంత్రిగానూ వ్యవహరించారు. కాగా, కరోనా మహమ్మారికి దుర్గాప్రసాద్ బలయ్యారని, ప్రాణాంతక వైరస్ ఆయనను కబళించడం తీవ్ర విచారం కలిగిస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేశ్ అన్నారు.












Click it and Unblock the Notifications