Bhuvaneswari murder case: రెడ్ సూట్కేస్లోనే గుట్టు: అక్క ట్రైనీ ఎస్ఐ: సీసీటీవీ ఫుటేజీ
తిరుపతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భువనేశ్వరి హత్య కేసు వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో భువనేశ్వరి భర్త మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ప్రధాన నిందితుడు. భార్యను హత్య చేసి.. ఆమె మృతదేహాన్ని ఓ రెడ్ కలర్ ట్రాలీ సూట్కేసులో కుక్కి తీసుకెళ్తోన్న దృశ్యాలతో కూడిన సీసీటీవీ ఫుటేజీ ఇది. ఈ కేసును ఛేదించడంలో భువనేశ్వరి అక్క కీలక పాత్ర పోషించారు. ఆమె కర్నూలులో ఎస్ఐగా శిక్షణ పొందుతోన్నారు. ఈ కేసులో తిరుపతి పోలీసులు ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
Recommended Video
Covaxin: భారత్ బయోటెక్కు బిగ్ షాక్: 324 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ రద్దు: బ్రెజిల్ సంచలనం
ప్రేమించి.. కులాంతర వివాహం..
ఈ నెల 23వ తేదీన ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. వేర్వేరు కులాలకు చెందిన వారే అయినప్పటికీ.. భువనేశ్వరిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి. అతని స్వస్థలం కడప జిల్లా బద్వేలు. చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరిదీ వేర్వేరు కులం. భువనేశ్వరి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం లభించడంతో భువనేశ్వరి.. భర్త శ్రీకాంత్ రెడ్డి, ఏడాది వయస్సున్న కుమార్తెతో కలిసి హైదరాబాద్ నుంచి సొంత జిల్లాకు వచ్చారు. తిరుపతిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తోన్నారు.
22న హత్య..
భార్యతో శ్రీకాంత్ రెడ్డి తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ కారణంతోనే ఈ నెల 22వ తేదీన భువనేశ్వరిని హత్య చేశాడు. ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఎరుపురంగు ట్రాలీ సూట్కేస్లో కుక్కి అపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోయాడు. భుజంపై పాప, చేతిలో ఎరుపురంగు సూట్కేస్తో అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్తోన్న దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ కేసును ఛేదించడంలో ఈ సీసీటీవీ ఫుటేజీ కీలకంగా మారింది. భువనేశ్వరిని హత్య చేసిన తరువాత ఆమె వినియోగించే సెల్ఫోన్ను ధ్వంసం చేశాడు.
డెల్టా ప్లస్ కట్టుకథ..
తమ కుమార్తె ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన భువనేశ్వరి తల్లిదండ్రులు శ్రీకాంత్ రెడ్డిని నిలదీయగా.. ఆమె కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడటంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో అడ్మిట్ చేయించానని, అక్కడే చికిత్స పొందుతూ మరణించిందని చెప్పాడు. డాక్టర్లు మృతదేహాన్ని అప్పగించలేదంటూ కట్టుకథను అల్లాడు. భువనేశ్వరి అక్క కుమార్తె మమత కర్నూలు జిల్లాలో ఎస్ఐగా శిక్షణ పొందుతోన్నారు. శ్రీకాంత్ రెడ్డి ప్రవర్తన, అతను చెప్పిన కారణాలపై అనుమానం రావడంతో ఆమె భువనేశ్వరి ఉన్న అపార్ట్మెంట్ సీసీ కెమెరా ఫుటేజీలను తిరుపతి పోలీసుల సహకారంతో పరిశీలించారు.
సీసీీటీవీ ఫుటేజీలతో..
హత్య జరిగిన రోజు అంటే ఈ నెల 22న ఉదయం కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లిన శ్రీకాంత్రెడ్డి ఎర్ర రంగు ట్రాలీ సూట్కేస్తో అపార్ట్మెంట్కు రావడం..మధ్యాహ్నం అదే సూట్కేస్ను తోసుకుంటూ కుమార్తెను ఎత్తుకుని ట్యాక్సీలో వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అదే రోజు ఉదయం సూట్కేసును కొనుగోలు చేయడం, మధ్యాహ్నం దాన్ని తీసుకుని బయటికి ఎందుకు వెళ్లడానే విషయంపై ఆరా తీయగా.. భువనేశ్వరి మృతదేహాన్ని అందులోనే కుక్కినట్లు తేలింది. అనంతరం శ్రీకాంత్ రెడ్డి ఆ సూట్కేసును తీసుకెళ్లి రుయా ఆసుపత్రి సమీపంలోకి కాల్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.