3డీ ఇమేజీతో శ్రీవారి ఆభరణాల ప్రదర్శన- తిరుమలలో గదుల అద్దెపెంపుపై మరోసారి ఈఓ స్పష్టత
దేశ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు- టీటీడీలో ఘనంగా జరిగాయి. టీటీడీ అడ్మిన్ బిల్డింగ్ ఆవరణలో ఈఓ ఏవీ ధర్మారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం తీసుకుంటోన్న చర్యలను వివరించ
తిరుపతి: దేశ 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు- తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఆవరణలో కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి..జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. టీటీడీ భద్రత, విజిలెన్స్ పరేడ్ లో పాల్గొన్నారు. విజిలెన్స్ చీఫ్ విశ్వనాథం- ఈ పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. ఈఓ ప్రసంగించారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే కోట్లాదిమంది భక్తుల కోసం తీసుకుంటోన్న చర్యలను వివరించారు.
రాజధానిగా అమరావతిపై సుప్రీంకోర్టులో..: మరో కీలక పిటీషన్ దాఖలు..!!
జీయంగార్లు సలహాలకు అనుగుణంగా..
జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర పండితుల సలహాలకు అనుగుణంగా తిరుమలతోపాటు తమ ఆధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.06 లక్షల మంది భక్తులకు ఉత్తరద్వారం గుండా స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 197 ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రామాల నుంచి 9,700 మందికి దర్శనాన్ని కల్పించామని, వారికి ఉచిత రవాణా, వసతి, ఆహారం అందించామని అన్నారు.
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు క్యూ లైన్లలో కిలోమీటర్ల దూరం చలిలో వేచి ఉండే ఇబ్బంది లేకుండా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద నవంబరు 1 నుంచి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను జారీ చేస్తోన్నామని, దీనివల్ల భక్తులు తిరుపతిలో టోకెన్ తీసుకుని వారికి కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుని, శ్రీవారి దర్శనం చేసుకుంటోన్నారని చెప్పారు.
రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు :
ఎల్లుండి తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. వాహనసేవలను వీక్షించడానికి తిరుమాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, కాఫీ, టీ, పాలు అందించనున్నామని తెలిపారు.
ఆస్తులపై శ్వేత పత్రం..
పారదర్శకంగా పరిపాలనను అందించడంలో భాగంగా శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రాలను విడుదల చేస్తోన్నామని ధర్మారెడ్డి చెప్పారు. గత ఏడాది సెప్టెంబరు 24వ తేదీన టీటీడీకి చెందిన 7,123 ఎకరాల్లో ఉన్న 960 ఆస్తులపై శ్వేతపత్రం ప్రకటించామని, దీని తుది జాబితాను తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అన్నారు. గత ఏడాది నవంబరు 5వ తేదీన కూడా టీటీడీకి వివిధ బ్యాంకుల్లో ఉన్న 15,938 కోట్ల రూపాయల నగదు, 10,258 కిలోల బంగారం డిపాజిట్లకు సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేశామని చెప్పారు.
ఎస్వీ మ్యూజియం
టాటా సంస్థ విరాళంగా అందించిన 120 కోట్ల రూపాయలతో తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తోన్నామని ధర్మారెడ్డి వివరించారు. ఇందులో శ్రీవారి ఆభరణాలను 3-డీ ఇమేజితో ప్రదర్శించనున్నట్లు. తెలిపారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటకల్లో 2,068 ఆలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ దాతలకు..
శ్రీవాణి ట్రస్ట్ కింద శ్రీవారికి విరాళాలను అందజేసే దాతలకు తిరుపతి విమానాశ్రయంలో రోజుకు 250 చొప్పున టికెట్లు ఇస్తున్నామని ధర్మారెడ్డి అన్నారు. వారికి తిరుపతిలోని మాధవం సముదాయంలో గదులు కేటాయిస్తున్నామని అన్నారు. తిరుమలలో 7,500 గదులు ఉన్నాయని, ఇందులో రూ.50, రూ.100 అద్దె కలిగిన దాదాపు 5,000 గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామని, వాటి అద్దె పెంచలేదని వివరించారు. రూ.132 కోట్ల రూపాయలతో ఆధునీకరించామని అన్నారు.