రూ.300 టికెట్లపై భక్తులకు TTD శుభవార్త
ఈ సంవత్సరం శ్రీవారి ఆదాయం రూ.1500 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 9.00 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు జరగాల్సిన బాలాలయం కార్యక్రమం వాయిదా పడింది.
దీంతో ఆ తేదీల వారీగా గతంలోనే విడుదల చేయాల్సిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను విడుదల చేయలేదు. బాలాలయం వాయిదాతో వాటిని ఈనెల 13న విడుదల చేస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. ఆన్లైన్లో టోకెన్లు బుక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతనంగా నిర్మించిన పరకామణి భవనంలో లెక్కించడం ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ సహకారంతో ఈ భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమల పెద్దజీయర్ స్వామి వారి ఆశీస్సులతో శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలను చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించారు. ఇకపై రోజూ అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయి. త్వరలోనే భక్తులు కూర్చునే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు.
ఏడుకొండలవాడికి ప్రతి ఏడాది మే, జూన్ నెలల్లో హుండీ ద్వారా లభించే ఆదాయం నెలకు రూ.100 కోట్లు దాటేది. మిగిలిన నెలల్లో నెలకు రూ.100 కోట్లలోపే ఉండేది. ప్రస్తుతం శ్రీవారికి నిత్యం రూ.4 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుండటంతో టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా ఆదాయం నెలకు రూ.100 కోట్లు దాటుతోంది. ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ.1500 కోట్లు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications