నారాయణుడి నామస్మరణ వినిపించాల్సిన చోట.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు: తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోలాహలం కొనసాగుతోంది. వేలాదిమంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొనసాగించనున్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించారు. రోజువారీ కంటే ఎక్కువ మంది భక్తులకు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే సౌకర్యాన్ని కల్పించారు.
వేలాదిమంది భక్తులతో..
వైకుంఠ ఏకాదశి నుంచి వరుసగా సంక్రాంతి సెలవులు రావటం వల్ల వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకోవడం వల్ల సామాన్య భక్తులు సకాలంలో శ్రీవారిని దర్శంచుకోలేకపోయారు. ప్రొటోకాల్ ప్రకారం.. వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడం వల్ల క్యూలైన్లను గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఫలితంగా పలువురు భక్తులు అసహనానికి గురయ్యారు.
తిరుమలలో ప్రముఖులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, ఏపీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, చిత్తూరు జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ దంపతులు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దంపతులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలంగాణ మంత్రి హరీష్ రావు దంపతులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
భక్తుల్లో అసహనం..
పెద్ద సంఖ్యలో వీఐపీలు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకోవడంతో టీటీడీ అధికారులు ప్రొటోకాల్స్ ప్రకారం.. వారికి ప్రాధాన్యతను ఇవ్వాల్సి వచ్చింది. ఫలితంగా క్యూలైన్లను నిలిపివేశారు. ప్రముఖులకు స్వామివారి దర్శనాన్ని కల్పించాల్సి రావడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లల్లో గడపాల్సి వచ్చింది. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు.. ఇక్కట్లకు గురయ్యారు. తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.
నీళ్లు..పాలు అందుబాటులో ఉంచినా..
తమకు సకాలంలో మంచినీళ్లను కూడా టీటీడీ సిబ్బంది అందించలేకపోయారనేది భక్తుల ఆరోపణ. క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు పాలు, అల్పాహారంగా ఉప్మా, మంచినీళ్లను అందుబాటులో ఉంచినప్పటికీ.. అవి అందజేయడంలో జాప్యం చోటు చేసుకుందనే విమర్శలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కంపార్ట్మెంట్లల్లోకి వెళ్లిన భక్తులకు సాయంత్రం 7 గంటల తరువాతే క్యూలైన్లల్లో నిల్చోవాల్సి వచ్చింది.
మహాద్వారం వద్ద బైఠాయింపు..
క్యూలైన్ ద్వారా మహాద్వారం వద్దకు చేరుకున్న తరువాత కొంతమంది భక్తులు తమ ఆగ్రహాన్ని అణచుకోలేకపోయారు. టీటీడీకి వ్యతిరేకంగా నినదాలు చేశారు. ఈఓ డౌన్ డౌన్ అంటూ నినదించారు. మహాద్వారం వద్ద క్యూలైన్లోనే బైఠాయించారు. 300 రూపాయల టికెట్ కొని స్వామివారి దర్శనానికి వచ్చామని, అయినప్పటికీ గంటల పాటు తాము కంపార్ట్మెంట్లల్లో గడపాల్సి వచ్చిందంటూ మండిపడ్డారు. ప్రముఖులకు స్వామివారి దర్శనాలను కల్పించడంలో టీటీడీ అధికారులు తరించారంటూ విమర్శించారు.
అధికారులు సర్దిచెబుతూ..
మహాద్వారం వద్దే విధి నిర్వహణలో ఉన్న టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్ సిబ్బంది.. భక్తులను శాంతింపజేయడానికి చాలాసేపు ప్రయత్నించాల్సి వచ్చింది. వారిని దండం పెడుతూ సముదాయించారు. జాప్యం చోటు చేసుకోవడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. పాలు, నీళ్లు ఆహారాన్ని అందుబాటలో ఉంచామని.. అవి ఎందుకు సకాలంలో భక్తులకు అందలేకపోయాయనే విషయంపై ఆరా తీస్తామని టీటీడీ ఉన్నతాధికారులు చెప్పారు.