అమరావతి ఉద్యమం 400 వ రోజు : గొల్లపూడిలో హై టెన్షన్ ; ఇంట్లోనే దీక్షకు దిగిన దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రాజకీయ వాతావరణం మొన్నటి నుండి హీట్ గానే ఉంది. కొడాలి నాని, దేవినేని ఉమా పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత, దేవినేని ఉమా సవాల్ చేయడం, ఆ తర్వాత పరిణామాలు కృష్ణాజిల్లా రాజకీయాలను హీటెక్కించాయి. గొల్లపూడిలో నిన్న దేవినేని ఉమ ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తారని ప్రకటించినప్పటి నుండి గొల్లపూడి లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దేవినేని ఉమా దీక్షకు అనుమతి లేదని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉద్రిక్తత చల్లారినట్టే భావించినా, ఈ రోజు మళ్ళీ అమరావతి ఉద్యమం 400 రోజుకు చేరడంతో గొల్లపూడి లో టిడిపి దీక్షకు పిలుపునివ్వడంతో హై టెన్షన్ నెలకొంది.
Recommended Video
జగన్ రెడ్డి క్రూరత్వం.. దేవినేని ఉమా అరెస్ట్ అక్రమం ; కొడాలి నానిపై కేసు పెట్టాలని చంద్రబాబు ఆక్రోశం
అమరావతి ఉద్యమానికి మద్దతుగా గొల్లపూడిలో దీక్షకు పిలుపునిచ్చిన దేవినేని ఉమా
అమరావతి ఉద్యమం 400 రోజులకు చేరుకున్న నేపథ్యంలో గొల్లపూడి లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు వారించడంతో దేవినేని ఉమ తన నివాసంలోనే దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన దేవినేని ఉమ ను, ధూళిపాళ్ల నరేంద్ర లను పోలీసులు అడ్డుకున్నారు .దీంతో పోలీసులతో టిడిపి నేతలు వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
గొల్లపూడిలో దీక్షను అడ్డుకున్న పోలీసులు .. దేవినేని నివాసంలోనే దీక్ష
అధికార పార్టీ నేతలకు అనుమతులు ఇస్తూ తమను ఎలా అడ్డుకుంటారంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఆపై దేవినేని ఉమా తన నివాసంలోనే దీక్షకు కూర్చున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర దేవినేని ఉమ దీక్ష కు సంఘీభావం తెలిపారు.
టిడిపి గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేరుకోకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరంతరం గొల్లపూడి లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గొల్లపూడి వన్ సెంటర్ ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది.
రాజధాని కోసం 117మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని దేవినేని ఫైర్
పోలీసులు దేవినేని ఉమాను అడ్డుకోవటంతో నివాసంలోనే దీక్షను కొనసాగిస్తున్న దేవినేని ఉమా రాజధాని కోసం ఇప్పటివరకు 117మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని , రాజధానిలో రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. సీఎం జగన్ పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని ఆయన మండిపడ్డారు.
జగన్ ఢిల్లీ వెళ్లి హోమంత్రి కాళ్లు పట్టుకుని ఏం సాధించారు ?
నిజాయితీ గల పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారారని విమర్శించారు .అధికారులు కేవలం జగన్ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఢిల్లీ వెళ్లి హోమంత్రి కాళ్లు పట్టుకుంటున్నారు కానీ, ప్రత్యేక హోదా అడిగారా ? నిధులు తీసుకురాగలిగారా ? ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు అంటూ దేవినేని ఉమ మండిపడ్డారు.