వైఎస్ జగన్కు తత్వం బోధపడినట్టుంది: వైసీపీ తప్పిదంగా: జనం వైపే మొగ్గు..కమలంతో ఢీ..!
అమరావతి: ఎంతటి వారికైనా.. ఎలాంటి వారికైనా కాస్త ఆలస్యంగానైనా తత్వం బోధపడుతుంటుందని అంటుంటారు పెద్దలు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంతే. ఆలస్యంగానే ఆయనకు తత్వ బోధ జరిగినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్, జాతీయ పౌర నమోదు.. వంటి చట్టాలపై తన వైఖరేమిటో ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఎన్పీఆర్ను అమలు చేయకూడదని నిర్ణయించారు. కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.

అల్లర్లకు కారణమైన చట్టాలపై పునరాలోచన..
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్, జాతీయ పౌర నమోదు.. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేర్లు ఇవి. దేశ రాజధాని సహా అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు, హింసాకాండకు తెర తీసిన చట్టాలు ఇవి. ఇదివరకు అస్సాం వంటి ఒకట్రెండు ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమై ఉన్న ఈ చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో వాటిని సవరించింది కేంద్రం. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ చట్టాలను ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోగలిగింది.

తొలుత సమర్థించి..
ఈ బిల్లులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలుత సమర్థించిన విషయం తెలిసిందే. అటు లోక్సభ, ఇటు రాజ్యసభల్లో దీనికి సంబంధించిన బిల్లులపై అనుకూలంగా ఓటు వేశారు ఆ పార్టీ సభ్యులు. ఒకవంక- తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇలాంటి చట్టాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. అదే సమయంలో ఏపీ దీనికి భిన్నంగా వ్యవహరించింది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు వేసింది.

పరిస్థితులను గమనించి..
ఈ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తొలి రోజు నుంచే దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రారంభంలో అస్సాం, మేఘాలయాలకే పరిమితమైన ఈ అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు దేశ రాజధానిని చుట్టుముట్టాయి. కేరళ వరకూ పాకాయి. ఏపీ, తెలంగాణలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్.. వంటి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు సైతం పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ జనాభా నమోదును యధాతథంగా అమలు చేయడానికి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Recommended Video


చట్టాలను ఆమోదించిన తరువాత..
మారిన పరిస్థితులకు అనుగుణంగా.. తన వైఖరిని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే వివాదాలకు కారణమయ్యే ఎలాంటి చట్టాన్ని కూడా అమలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. సచివాలయంలో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించింది ప్రభుత్వం. అమలు చేయడం వల్ల కలిగే లాభ, నష్టాలను బేరీజు వేసింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడచుకోవాలని నిర్ణయించింది. దీనికోసం కేంద్రాన్ని ఢీ కొట్టడానికీ సిద్ధపడుతోంది.












Click it and Unblock the Notifications